బిగ్ థ్యాంక్స్-ప్రశంసలు: ‘మిలియనీర్’ అయిపోయిన కేటీఆర్!
హైదరాబాద్: ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ప్రజల సమస్యలపై వెంటనే స్పందించే తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు మరో ఘనతను సాధించారు. ట్విట్టర్లో ఆయనను అనుసరించే వారి సంఖ్య పది లక్షలకు (మిలియన్ ఫాలోయర్స్) చేరడం గమనార్హం.
ఈ ఘనత సాధించిన ప్రముఖుల జాబితాలో ఆయన శుక్రవారం చేరారు. తనను అనుసరించే వారి సంఖ్య పది లక్షలకు చేరగానే కేటీఆర్ స్పందించి 'మిలియన్ థ్యాంక్స్' అని ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు.
అందరికీ అందుబాటోనే
‘అందరికీ అందుబాటులో ఉంటాను' అని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. విస్తృత ప్రాచుర్యం గల సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ను వేదికగా చేసుకొని కేటీఆర్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను నిత్యం ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే.
Recommended Video
సమస్యలపై స్పందన
ప్రజా సమస్యలు, వైద్య చికిత్సకు సంబంధించిన వినతులపై సత్వరమే స్పందిస్తున్నారు. పలు అంశాల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు సైతం ట్విట్టలో సమాచారం రాగానే అధికారులకు ఆదేశిస్తున్నారు.
అభినందనల వెల్లువ
రెండేళ్ల క్రితం ఆయనకు 50 వేల మంది ఫాలోవర్లుండగా, ఇప్పుడు ఆ సంఖ్య పది లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఉప హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, ఉప మేయర్ ఫసియుద్దీన్ తదితరులు కేటీఆర్కు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ఈ జాబితాలో ఉన్న అతికొద్ది రాజకీయ నేతల్లో కేటీఆర్ ఒకరని వారు పేర్కొన్నారు. అంతేగాక, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా కేటీఆర్ను అభినందిస్తూ ట్వీట్లు చేశారు.
లక్ష ఇళ్ల పూర్తికి ఆదేశం
హైదరాబాద్ నగరంలో పేదలకు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాదంతా మంజూరైన ఇళ్లను నిర్మించి లబ్ధిదారుల చేతుల్లో పెట్టడమే మంత్రులు, ఎమ్మెల్యేల బాధ్యతని మంత్రి స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని గాంధీనగర్, మారేడుపల్లిలో దాదాపు 800 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 75 వేల ఇళ్లను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ గుర్తు చేశారు. భోజగుట్టలో 2 వేల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చూస్తే కొందరు అడ్డుకోవడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రలు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.