ఐటీ, స్మార్ట్సిటీలపై స్పీచ్: స్పెయిన్, ఫిక్కీ-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె. తారకరామారావుకు స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగే ఫిక్కీ-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ సమావేశానికి ఆహ్వానం అందింది. జూన్ 24 జరగనున్న సమావేశాల్లో చర్చా కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఫిక్కీ నిర్వాహక బృందం ఆయనను ఆహ్వానించింది.
అంతేగాక, స్పెయిన్ ప్రభుత్వం కూడా ఆహ్వానం పలికింది. ఈ సమావేశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ, పర్యాటక రంగంలో వివిధ సంస్థల సహకారం అనే అంశంపై చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఐఫా సినిమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈసారి స్పెయిన్లోని మాడ్రిడ్లో జరగనుంది.
ఈ సమావేశాలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, సినిమా, మీడియా, ఎంటర్టైన్మెంట్, రెన్యువబుల్ ఎనర్జీ, పురపాలన, రహదారుల అభివృద్ధి వంటి రంగాల్లో పలు దఫాలుగా చర్చలు నిర్వహించనున్నారు. కాగా, ఐటీ, టూరిజం సెషన్లో మంత్రి కెటిఆర్ను ప్రసంగించాలని కోరారు.
జాతీయ కార్యవర్గ సమావేశానికీ ఆహ్వానం
జులై 4న హైదరాబాద్లో జరిగే ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ ప్రసంగించాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఫిక్కీ ఛైర్మన్ హర్షవర్దన్ నియోటియోతో పాటు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 'తెలంగాణలో వ్యాపార అవకాశాలు' అనే అంశంపై కేటీఆర్ను మాట్లాడాలని కోరుతూ తెలంగాణ ఫిక్కీ ఛైర్మన్ సంగీతారెడ్డి ఆహ్వానం పంపారు. ఫిక్కీ పంపిన రెండు అహ్వానాల పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.