ట్రయలరే, చాలా సినిమా చూడాలి: పొన్నాలపై కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు కెటి రామారావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పొన్నాల చూసింది ఇప్పటి వరకు ట్రయలరేనని, ఇంకా చాలా సినిమా చూడాల్సి ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నేతలు అధికారం పోయిన ఆరు నెలలకే ఆగమాగం అవుతున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆయన శనివారం మీడియాతో అన్నారు. పొన్నాల పాదయాత్ర చేసినా, మోకాళ్ల మీద యాత్ర చేసినా అధికారంలోకి రారని ఎద్దేవా చేశారు. పొన్నాల ఇంకా చాలా యాత్రలు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్పార్టీ కళేబరంగా పడి ఉందని విమర్శించారు.

సచివాలయం తరలింపు విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ఉందని వివరించారు. తాము ప్రజలకు మాత్రమే బాధ్యత వహిస్తామన్నారు. పాలనా సౌలభ్యం కోసమే సచివాలయాన్ని తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసమైతే ప్రతిపక్షాలతో చర్చిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విధానాలకు నిరసనగా కాంగ్రెసు పార్టీ నాయకులు శనివారం ఉదయం గాంధీభవన్ నుంచి పాదయాత్రను తలపెట్టారు. ఈ పాదయాత్రను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications