ఎండొచ్చింది: అధికారులతో కేటీఆర్, 'చంద్రబాబుని చూసి నేర్చుకోండి'
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హైదరాబాద్ నగర రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం నుంచి వర్షం కురవడం లేదని, సూర్యుడు బయటకు వచ్చాడని గుర్తు చేస్తూ, వెంటనే రోడ్లపై పేరుకుపోయిన గులక, ఇసుక, మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. మట్టి పేరుకుపోయి గుంతలు పడిన ప్రాంతాలపై ముందుగా దృష్టి సారించాలని అన్నారు.
గుంతలను పూడ్చాలని అధికారులకు ఆదేశాలు
ఆ తర్వాత తారు రోడ్లకు పడిన గుంతలను పూడ్చాలని సూచించారు. రోడ్లు పూడ్చడానికి అవసరమైన నిధులకు సంబంధించి వివరాలు అందిస్తే, ఆ ప్రతిపాదనలను సీఎంకు పంపి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. రోడ్ల మరమ్మత్తుల పర్యవేక్షణకు ఇతర శాఖల్లోని ఇంజనీర్లను వినియోగించుకోవాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం
మరోవైపు హైదరాబాద్ నగరంలో రహదారులు అధ్వాన్నంగా మారడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల దుస్థితిపై ప్రజలకు వివరించేందుకు గాను టీడీపీ ఆధ్వర్యంలో బండ్లగూడలోని పార్టీ ఆఫీసులో ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు.
రోడ్ల దుస్థితిపై ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎల్.రమణ
ఈ ఫోటో ఎగ్జిబిషన్కు పార్టీ అధ్యక్షుడు రమణతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందరోజుల ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి కేటీఆర్ ఇప్పుడు పట్టించుకోవడమే మానేశారని ఆయన విమర్శించారు.
అప్పట్లో చంద్రబాబు అద్భుతంగా పనిచేశారు
2000 సంవత్సరంలో 24 సెం.మీ వర్షపాతం కురిసినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు అద్భుతంగా పనిచేశారని ఆయన కొనియాడారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కనీసం బస్తీల్లో కూడా పర్యటించలేకపోయారని విమర్శించారు. నగరంలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.