హైదరాబాద్లో చెల్లని రూపాయి వరంగల్లో చెల్లుతుందా: సర్వేపై కెటిఆర్
వరంగల్: హైదరాబాదులో చెల్లని రూపాయి వరంగల్ ఉప ఎన్నికల్లో ఎలా చెల్లుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు ఎద్దేవా చేశారు. కెటిఆర్... మాజీ కేంద్రమంత్రి, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను చెల్లని రూపాయితో పోల్చారు.
హైదరాబాదులో చెల్లని రూపాయి వరంగల్లో చెల్లుతుందా అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. కెటిఆర్ బిజెపి అభ్యర్థి పైన కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
డాలర్లకు ఓట్లు రాలవన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు.
ఆర్టీసీ కార్మికులకు రూ.5 లక్షల బీమా ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి బియ్యం తింటున్నారో, అలాంటి బియ్యాన్నే హాస్టళ్లలోని విద్యార్థులకు కూడా పెడుతున్నామన్నారు. పెద్దవాళ్లంతా కేసీఆర్ను తమ పెద్ద కుమారుడిగా చూస్తున్నారని. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను గెలిపించాలన్నారు.
నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీకి ముఖం లేదని, కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక ఆపద్ధర్మ అభ్యర్థిని బరిలో దింపిందన్నారు. బీజేపీనేమో అమెరికా నుంచి అభ్యర్థిని పోటీకి నిలబెట్టిందన్నారు.
అందరూ నాన్లోకల్సేనని ఎద్దేవా చేశారు. స్థానికుడైన పసునూరి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీ ఏనాడూ ఆదుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ప్రతి నెల రూ.75 కోట్ల జీతాల పెంపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని, ఒకేసారి 4,300 మంది ఆర్టీసీ కార్మికులను క్రమబద్దీకరించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. భవిష్యత్లో ఆర్టీసీ కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు.