బీఆర్ఎస్ లోకి కీలక నేతల చేరిక, జూబ్లీహిల్స్ లో కొత్త లెక్కలు..!!
జూబ్లీహిల్స్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. సీఎం రేవంత్ నేరుగా ప్రచారంలోకి దిగారు. బీఆర్ఎస్, బీజేపీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వ్యూహం మార్చింది. నియోజకవర్గంలోని ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. బీజేపీ సైతం టీడీపీ, జనసేన నేతలను ప్రచారంలోకి దించేందుకు సిద్దం అవుతోంది. దీంతో.. జూబ్లీహిల్స్ లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
జూబ్లీహిల్స్ లో గెలుపు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సీఎం రేవంత్ ఈ ఎన్నిక కోసం స్వయంగా ప్రచారం చేస్తున్నారు. మంత్రులను భారీ స్థాయిలో మొహరించారు. అటు కేటీఆర్ పూర్తిగా పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. తండ్రి మరణంతో ప్రచారానికి హరీష్ దూరంగా ఉన్నారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రచార తీరును పర్యవేక్షిస్తూ.. సర్వే నివేదికల ఆధారంగా సూచనలు చేస్తున్నారు. కాగా.. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. కేటీఆర్ సమక్షంలో టిడిపి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ నాయుడు, ఇతర టిడిపి నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సీఎం రేవంత్ ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని మండి పడ్డారు.

రెండేళ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్ భ్రష్టు పట్టించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చారని చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందించామని వెల్లడించారు. ఇలాంటి ఎన్నో పథకాలను రేవంత్ సర్కార్ బంద్ చేసిందని చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications