కేటీఆర్ స్వేదపత్రం వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే!!
తెలంగాణ రాజకీయాలు శ్వేతపత్రం వర్సెస్ స్వేద పత్రం అన్నట్టు కొనసాగుతున్నాయి. శాసనసభ వేదికగా రెండు రోజులపాటు కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేత పత్రాలలో తెలంగాణ రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయిందని, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం కొనసాగిందని, గత బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రానికి కౌంటర్ గా తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంపద సృష్టి తదితర అంశాలపై స్వేద పత్రం విడుదల చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొంటారని పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. దీంతో ఈరోజు కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు అన్నది అందుకే ప్రతి ఒక్కరిలో ఆసక్తికరంగా మారింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కార్యక్రమం వాయిదా పడింది.
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని, పగలు, రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోమని చెప్పిన కేటీఆర్ ఈరోజు స్వేద పత్రంలో ఏం చెప్పబోతున్నారు అన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగించింది.
కానీ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేపు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నేడు ఎందుకు వాయిదా పడింది అన్న కారణాలు మాత్రం ఇంతవరకు తెలియ రాలేదు. ఏది ఏమైనా అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్, గత బిఆర్ఎస్ పాలనను టార్గెట్ చేస్తూ అధికార కాంగ్రెస్ ఇప్పటి నుంచే మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications