నెహ్రూ నుంచి అన్యాయమే, సోనియా ఊరికే ఇవ్వలేదు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ తొలి తరం నుంచి నేటి తరం వరకు తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఇలా అందరూ అన్యాయం చేశారన్నారు.
నాడు తెలంగాణ నీటిని ఆంధ్రాకు తరలిస్తుంటే హారతి పట్టిన వాళ్లు ఇప్పుడు తమను విమర్శించడం విడ్డూరమని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణను ఊరికేనే ఇవ్వలేదని, తప్పని పరిస్థితుల్లో ఇచ్చారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

కొలువుల కొట్లాడ జైపాల్ కోసమా, జానా కోసమా
రాష్ట్రం కొంతమంది నాయకులు కోదండరాంను పట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కొలువుల కొట్లాట ఎవరి కోసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందన్నారు. కొలువుల కొట్లాట జానా రెడ్డి పదవి కోసమా, జైపాల్ రెడ్డి పదవి కోసమా అని నిలదీశారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులు ఉద్యమ సమయంలో ఏనాడైనా కలిసి వచ్చారా అన్నారు.

మాకు అధికారం ఇచ్చారు
యాభై ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ సాధించిన వ్యక్తి సీఎంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. తమకు 60 నెలల అధికారం ఇచ్చారని, ఆనాటి వరకు లక్ష కాదు లక్షా పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ భూసేకరణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారన్నారు. ఇందిరా వందల మంది తెలంగాణ ప్రాణాలు బలిగొన్నారన్నారు.

కాంగ్రెస్ది మొసలి కన్నీరు
ఫార్మాసిటీతో పాలమూరు, రంగారెడ్డి యువతకు లక్ష ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. ప్రతీ అంశంపై కోర్టుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. మొసలి కన్నీరు కారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ అన్నారు. తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్సే అన్నారు. తమ బాసులు ఢిల్లీలో లేరని, తెలంగాణ గల్లీలో ఉన్నారన్నారు.
మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు.

ప్రజలే చూసుకుంటారు
పాలమూరు జిల్లా పచ్చబడుతోందని కేటీఆర్ చెప్పారు. వచ్చే ఎండాకాలం నాటికి మహబూబ్నగర్లో ఇంటింటికి ప్రతీ రోజు నీళ్లిస్తామని చెప్పారు. గతంలో పాలమూరు దేశంలోనే వెనుకబడిన జిల్లా అని, ఇప్పుడు జిల్లా దశ మారిందన్నారు. వలసకు వెళ్లిన వాళ్లు ఇప్పుడు తిరిగి వస్తున్నారని చెప్పారు. పాలమూరు ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న సోయిలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తమపై విమర్శలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారన్నారు. పాలమూరు జిల్లా ప్రజలారా.. కాంగ్రెస్ నేతల పట్ల పారాహుషార్ అన్నారు. కొలువుల కొట్లాట పేరుతో పిల్లలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications