ఏపీలో వేలు.. రాజకీయంగా లేకుండాచేస్తాం, అందుకే తరిమేశాం: బాబుకు కేటీఆర్ హెచ్చరిక, నంద్యాల గెలుపుపై..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి (ఆపద్దర్మ) కేటీఆర్ షాకిచ్చారు. తెలంగాణలో ఆయన ఇలా చేస్తే, తాము ఏపీ రాజకీయాల్లోను వేలు పెడతామని హెచ్చరించారు. ఏపీ రాజకీయాల్లో తాము జోక్యం చేసుకుంటే చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని చెప్పారు.
తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ చంద్రబాబు భ్రమల్లో తేలిపోతున్నారని, ప్రాంతాలకు అతీతంగా కలిసి ఉంటున్న హైదరాబాద్ ప్రజల మధ్య మళ్లీ విభేదాలు సృష్టించే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆటకట్టించేందుకైనా తాము (తెరాస) ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతుందని చెప్పారు.
చంద్రబాబుకు ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసు
ఇక్కడి రాజకీయాల్లో వేలుపెట్టిన చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసునని కేటీఆర్ చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో కుల, మత, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారన్నారు. అలాంటి సీఎంను అందరూ తరిమికొట్టాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
కేసీఆర్ దెబ్బకు మాట మార్చారు
నిన్నటి వరకు హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చెప్పిన చంద్రబాబు తమ పార్టీ అధినేత కేసీఆర్ దెబ్బకు మాట మార్చారని కేటీఆర్ చెప్పారు. అందుకే హైదరాబాద్ కాదు.. సైబరాబాద్ నిర్మించానని చెబుతున్నారని అన్నారు. ఇప్పుడు తెలంగాణను నిర్మించింది తానే అని చెబుుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు బిల్డింగులు కట్టిన చంద్రబాబే అలా అనుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కేసీఆర్ను ఏమనాలన్నారు. పైగా నేనేం తప్పు చేశానని కేసీఆర్ నన్ను తిడుతున్నారని ప్రశ్నిస్తూ చంద్రబాబు అమాయకత్వం నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటు కేసును లాగిన కేటీఆర్
తెలంగాణ ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.50 లక్షలు ఓ ఎమ్మెల్యే చేతికి ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పంపించలేదా అని ఓటుకు నోటు అంశాన్ని కేటీఆర్ లేవనెత్తారు. ఫోన్లో బ్రీఫ్డ్ మి అని అనలేదా అన్నారు. బషీరాబాగ్లో రైతులపై కాల్పులు జరిపారని, వ్యవసాయం దండుగ అన్నారని గుర్తు చేశారు.
పక్క రాష్ట్రాలతో గిల్లికజ్జాలు వద్దు
పక్క రాష్ట్రాలతో తాము ఎప్పుడూ గిల్లిగజ్జాలు కోరుకోలేదని కేటీఆర్ చెప్పారు. సానుకూల వాతావరణంలో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. గోదావరి జలాల వివాదాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి పరిష్కరించుకున్నామని గుర్తు చేశారు. ఏపీతోను అలాగే ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు.
నంద్యాలలో ఎలా గెలిచారో తెలుసు
చంద్రబాబు డబ్బులు, తనకు ఉన్న అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎంత ఖర్చుపెట్టారో అందరికీ తెలుసునని చెప్పారు. ఇలాంటి నాటకాలు ఆడినందుకే ఆయనను అమరావతికి తరిమికొట్టామన్నారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలో కేసీఆర్కు తెలుసునని, ఆయన ఆటకట్టించేందుకైనా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పారు.