భవిష్యత్తులో ప్రధానిగా కేటీఆర్-బండి పాదయాత్రలో జనం లేరు-రేవంత్ బ్లాక్మెయిల్ బ్రాండ్ అంబాసిడర్: జీవన్ రెడ్డి
తెలంగాణ మంత్రి కేటీఆర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ భవిష్యత్తులో ప్రధాని అవుతారని పేర్కొన్నారు. కేటీఆర్ నాయకత్వ పటిమను,వాగ్దాటిని చూసి ప్రతిపక్షాలు అసూయపడుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీల్లో కేటీఆర్ లాంటి నాయకుడిని చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వానికి రాసిన లేఖకు జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
'వచ్చే 20, 30 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని అవుతారు. తెలంగాణలో నిరుద్యోగులు ఉండటానికి కాంగ్రెస్, టీడీపీలే కారణం. ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వుంటే ఇప్పుడు నిరుద్యోగులు ఉండేవాళ్లే కాదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు టీఆర్ఎస్కే ఓటు వేశారు కదా... మీకు ఎందుకు ఓటు వేయలేదు? హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలిచాక బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరాల్సిందే. ఎమ్మెల్యే రఘునందన్ కూడా పెద్దగా చదివినట్లు కనిపిస్తలేదు. డేటా లేకుండా మాట్లాడుతున్నారు.' అని జీవన్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.
ప్రధాని మోదీ విదేశాల నుంచి తీసుకొస్తానన్న నల్లధనం,నిజామాబాద్కు పసుపు బోర్డు,గిరిజన యూనివర్సిటీ నిర్మాణం,2కోట్ల ఉద్యోగాల కల్పన,ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ ద్వారా వచ్చిన లాభమెంత,కరోనా సమయంలో ఇచ్చిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.సంజయ్ పాదయాత్ర జనం లేక పరువుపోతోందన్నారు.పాదయాత్రలో సంజయ్ తొండి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అని ఎద్దేవా చేశారు. పెట్రోల్పై పన్నుల బాదుడుతో కేంద్రం సామాన్యుల రక్తాన్ని జలగల్లా తాగుతోందన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తుపాకీ రాముడు అంటూ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.అమరవీరుడు శ్రీకాంత చారి చనిపోవడానికి కర్త,కర్మ,క్రియ రేవంత్ రెడ్డే అని ఆరోపించారు.ఆనాడు ఆంధ్రా బాబు చంద్రబాబు కనుసైగల్లో పనిచేసిన రేవంత్... తెలంగాణ వ్యతిరేకి అన్నారు.ఆనాడు సోనియా గాంధీని తెలంగాణ పాలిట దెయ్యం అన్న రేవంత్... ఇప్పుడు మా దేవత అంటున్నాడని పేర్కొన్నారు.దళిత గిరిజన దండోరా పేరుతో డ్రామాలకు తెరలేపిన రేవంత్... ఇప్పుడు జంగు సైరన్ అంటున్నారని... అది జంగు సైరన్ కాదు... అది కలెక్షన్ సైరన్ అని ఎద్దేవా చేశారు.రేవంత్ అంటేనే బ్లాక్మెయిల్కి బ్రాండ్ అంబాసిడర్ అని అందరికీ తెలుసన్నారు.టీపీసీసీ అంటే తెలుగుదేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని... ఇప్పటికీ చంద్రబాబు కనుసైగల్లోనే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు :
'మిస్సింగ్ కేటీఆర్' అంటూ హైదరాబాద్లోని పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. 'గులాబ్' తుఫాను ఎఫెక్ట్తో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగితే.. కేటీఆర్ అక్కడ ఎందుకు పర్యటించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంత్రి తీరును నిరసిస్తూ మిస్సింగ్ కేటీఆర్ పేరుతో పోస్టర్లు అంటించారు.ఈ పోస్టర్లు ప్రస్తుతం సోషల్మీడియా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల 'గులాబ్' తుఫాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కుండపోత వర్షాలతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ ప్రాంతాల్లో పర్యటించకపోవడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.