ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం చేసిన కేయూ విద్యార్ధి మృతి
ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్ధి బోడ సునీల్ హైదరాబాద్ లో ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సునీల్ మృతితో వరంగల్ విద్యార్ధి లోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Recommended Video
ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం
మహబూబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో తేజావత్ రామ్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన బోడ సునీల్ ఒక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ వద్ద సునీల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికి అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మార్చి 28 వ తేదీన నిమ్స్ కు తరలించారు .
నిమ్స్ లో చికిత్స పొందుతూ బోడ సునీల్ మృతి
నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు బోడ సునీల్ మరణించారు. మార్చి 26వ తేదీ నుండి చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియోని తీసి ఐఏఎస్ కు కావలసిన వాడిని, ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. విద్యార్థులు ముఖ్యమంత్రిని విడిచి పెట్టొద్దని పేర్కొన్నాడు. తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని సునీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎంత ఎదురు చూస్తున్నారని వారి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బోడ సునీల్ చెప్పాడు.
సునీల్ మృతదేహం స్వగ్రామానికి తరలింపు
ఇక సునీల్ చాలాకాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు 2016లో ఎస్ఐ పరీక్షలో క్వాలిఫై కూడా అయ్యాడు . అయితే ఫిజికల్ టెస్ట్ లో హైట్ తక్కువగా ఉన్న కారణంగా బోడ సునీల్ ను ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఇక అప్పటి నుండి ఉద్యోగ ప్రయత్నాలు లోనే ఉన్న సునీల్ నోటిఫికేషన్లు రాకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో సునీల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సునీల్ మృతి పట్ల కాంగ్రెస్ నేతల దిగ్భ్రాంతి .. ప్రభుత్వం కల్లు తెరవాలన్న నాయిని రాజేందర్ రెడ్డి
సునీల్ మరణం పట్ల వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యోగాల నోటిఫికేషన్లు రావట్లేదని ఆత్మహత్య చేసుకోవడం తమను బాధించిందని వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల డిసిసి అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ మరణంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.