బాలసాయి బాబా కన్నుమూత.. భక్తులెంతనో వివాదాలు అంతే..!
హైదరాబాద్ : ఆధ్యాత్మిక గురువుగా చలామణి అయిన కర్నూలు బాల సాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దోమల్ గూడ ప్రాంతంలోని ఆశ్రమంలో సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. దీంతో ఆయన అనుచరులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కర్నూలుకు చెందిన 59 ఏళ్ల బాల సాయిబాబా 1960 జనవరి 14న జన్మించారు. ఆయన అసలు పేరు కన్ననూరు బాలరాజు. 18 ఏళ్ల వయసులోనే ఆశ్రమం ఏర్పాటు చేశారు. శివరాత్రి నాడు కడుపులోంచి ఆత్మలింగం బయటకు తీసే ప్రక్రియతో బాగా ప్రాచుర్యం పొందారు. దీంతో ఆధ్యాత్మిక గురువుగా చలామణి అయ్యారు. దేశ విదేశాల్లో ఆయనకు అనుచరగణం భారీ స్థాయిలో ఉన్నారు.

ఆత్మలింగం.. "బాబా" గా సోపానం
తనకు తానుగా బాబాగా ప్రకటించుకున్న బాలసాయి తుంగభద్ర నది ఒడ్డున బాలసాయి సెంట్రల్ సేవా నిలయం స్థాపించారు. కర్నూలు ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అతి చిన్న వయసులో 18వ ఏట ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఏ దేవుడికి పూజలు చేయనని చెప్పుకున్న బాలసాయి తనను దేవుడిగా భావించి వచ్చేవారికి దైవంలా కనిపిస్తానని కామెంట్ చేసేవారు. ఒకానొక సందర్భంలో కమ్యూనిస్టు దేవుడిగా ప్రచారం చేసుకున్నారు.
కర్నూలు లోని శ్రీనిలయం కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించారు బాలసాయి. ప్రతి యేటా శివరాత్రి నాడు నోట్లోంచి శివలింగం తీయడంతో బాగా ప్రాచుర్యం లభించింది. అయితే గతేడాది కడుపులోంచి ఆత్మలింగం తీసే క్రమంలో ఆయన కొంత ఇబ్బందిపడ్డారు. అనారోగ్యం కారణంగానే అలా జరిగి ఉండొచ్చని భక్తులు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న బాలసాయి.. గుండెపోటుతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

వివాదాలు, కేసులు
బాబాగా చలామణి అయిన బాలసాయిపై వివాదాల చిట్టా చాలా పెద్దది. సేవా కార్యక్రమాల పేరిట విదేశాల నుంచి భారీగా విరాళాలు సేకరించారనే ఆరోపణలున్నాయి. వాటిని ఖర్చుపెట్టకుండా సొంత ఆస్తులు కూడబెట్టుకున్నట్లు కేసులు కూడా నమోదయ్యాయి. హేతువాదులు బాలసాయిని వ్యతిరేకించిన సందర్భాలు అనేకం. వెంకటేశ్వర స్వామి, మీరు ఒక్కటేనా అనే ప్రశ్నకు.. "బండ రూపంలో ఉండే ఆయనకంటే భక్తుల కోరికలు ఆర్చి తీర్చే నేనే ఎక్కువ" అంటూ సమాధానం ఇచ్చేవారు. దీంతో కొందరు బాలసాయి తీరును తప్పుబట్టడమే గాకుండా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుట్టపర్తి సాయిబాబా గురించి కూడా ఆయన చేసిన కామెంట్లు చర్చానీయాంశంగా ఉండేవి. ఆయన పేరు కలిసేలా తాను పేరు పెట్టుకోలేదని.. ఆయనే తన పేరు పెట్టుకుని ఉండవచ్చేమో అంటూ ఎదురు ప్రశ్నించేవారు. పెళ్లి విషయంలో కూడా వింతైన సమాధానాలు చెప్పేవారు. అసలు వివాహం ఎందుకు చేసుకోలేదని ఎవరైనా అడిగితే తాను ఎవరిని.. పురుషుడినా, స్రీనా, నపుంసకుడినా అంటూ విస్మయానికి గురిచేసేవారు. ఇలా బాలసాయి జీవితమంతా వివాదాల చుట్టే తిరిగిందని చెప్పొచ్చు.

అది మహిమ కాదు మ్యాజిక్..!
బాబాగా చలామణి అవుతూ తనకు అతీత శక్తులున్నాయంటూ చెప్పుకునే బాలసాయిపై హేతువాదులు మండిపడేవారు. కడుపులోంచి ఆత్మలింగం తీయడం మహిమ కాదని.. అది మ్యాజిక్ అని ఆరోపించేవారు. అంతా కనికట్టు అని మాటల దాడికి దిగేవారు. వీటిని బాలసాయి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. బాబాగా తనదైన ప్రవచనాలతో భక్తులను కూడగట్టుకున్న బాలసాయి.. అదేస్థాయిలో వివాదాలకు కేంద్రబిందువుగా మారడం గమనార్హం.












Click it and Unblock the Notifications