టిఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి, కెసిఆర్కు భయం, మోత్కుపల్లిపై ఇలా.: ఎల్. రమణ సంచలనం
హైదరాబాద్:తెలంగాణలో అవకాశం వస్తే టిడిపి బలోపేతమైతే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ భావిస్తున్నారని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి లు అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ వర్థంతి రోజున మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు చాలా క్షోభకు గురి చేశాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారుతారని భావించడం లేదన్నారు.
టిఆర్ఎస్ నేతలు పలు దఫాలు తమను పార్టీలోకి ఆహ్వనించారని, తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలకు అండగా పార్టీని కాపాడేందుకు టిడిపిలోనే కొనసాగాలని నిర్ణయించుకొన్నట్టు వారు చెప్పారు.
2019 ఎన్నికల నాటికి తెలంగాణలో టిడిపిని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టు టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు.
ఓ తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో ప్రస్తుతం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు, టిడిపిని బలోపేతం చేసేందుకు తీసుకొంటున్న చర్యలను వారు గుర్తు చేశారు.

ఎన్టీఆర్ను ఎదిరించాం
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపిని కాపాడుకొనేందుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ను ఎదిరించిన విషయాన్ని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు.పార్టీ ఆవిర్భావం నుండి అనేక సంక్షోభాలను చవిచూసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.సంక్షోభాలను అధిగమిస్తూ టిడిపి బలోపేతమైన విషయాన్ని వారు గుర్తు చేసుకొన్నారు. టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కలిచివేసినట్టు వారు చెప్పారు.

తెలంగాణలో 8 లక్షల సభ్యత్వం
సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం 8 లక్షల సభ్యత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉందని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ వెళ్లిపోయిన తర్వాత కూడ 8 లక్షల సభ్యత్వం చేర్పించామన్నారు. వారంతా పార్టీలో ఉన్న కాలంలో 7 లక్షల సభ్యత్వమే ఉందని రమణ గుర్తు చేశారు. తెలంగాణలో పార్టీ మనుగడను ప్రజలు కోరుకొంటున్నారని ఈ సభ్యత్వాలను బట్టి తెలుస్తోందన్నారు.

సహయ సహకారాలుంటాయని బాబు హమీ
మారిన పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణలో పార్టీని కాపాడుకొనేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు.తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారని ఎల్. రమణ చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలను చేస్తున్నట్టు చెప్పారు. మరో వైపు తెలంగాణలో పార్టీ బలోపేతం చేసేందుకు తన సహయ సహకారాలుంటాయని చంద్రబాబు చెప్పారని ఆయన గుర్గు చేశారు.

టిఆర్ఎస్ లో చేరాలని కోరారు
టిఆర్ఎస్లో చేరాలని తనను రెండు దఫాలు ఆహ్వనించారని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు.2014 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ లో చేరాలని ఆహ్వనించారని చెప్పారు. దయాకర్ రావు నేతృత్వంలో టిడిపి ఎమ్మెల్యేలు టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడ టిఆర్ఎస్ లో చేరాలని ఆహ్వనించారని రమణ చెప్పారు. అంతేకాదు పార్టీలకు సంబంధం లేకుండా ఇతరుల నుండి కూడ ఈ మేరకు చర్చించినా తాను టిడిపిని వీడేది లేదని స్పష్టం చేసినట్టు ఎల్. రమణ చెప్పారు.

2014లో ఓడిపోతానని తెలుసు
2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఓటమి పాలౌతానని తెలిసి కూడ టిడిపిలో ఉన్నానని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు. తనను కూడ టిఆర్ఎస్ లో చేరాలని ఆహ్వనాలు వచ్చాయని చెప్పారు. టిడిపి అధికారంలో ఉన్న కాలంలో తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడినవారు ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఉన్నారని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందున్న పరిస్థితులను గమనిస్తే తాను ఎమ్మెల్యేగా ఓటమి పాలౌతానని తెలుసునని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కొత్త వారికి ఇంచార్జీ బాధ్యతలను అప్పగిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications