లేబర్ ఆఫీసర్ కిడ్నాప్, ఇసుక వ్యాపారులపై అనుమానం, 4 రోజులుగా తెలియని ఆచూకీ..
ఇసుకాసురులు అధికారులను కూడా వదలడం లేదు. తమ అక్రమ మార్గానికి అడ్డొస్తోన్న అధికారులను నయానో భయానో బెదిరిస్తున్నారు. అప్పటికీ వినకుంటే కిడ్నాప్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో లేబర్ అధికారిని వ్యాపారులు కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల నుంచి అధికారి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే కిడ్నాప్ వ్యవహారంలో ఓ సీఐ పాత్ర ఉండటంతో పోలీసులను కూడా విశ్వసించే పరిస్థితి లేదని ఫ్యామిలీ మెంబర్స్ వాపోతున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్ రెడ్డి లేబర్ అధికారిగా పనిచేస్తున్నారు. డ్యూటీలో సీన్సియర్ అండ్ సీరియస్గా ఉండే ఆనంద్ రెడ్డి అంటే.. మిగతావారికి గిట్టలేదు. ముఖ్యంగా ఇసుక వ్యాపారులు జీర్ణించుకోలేకపోయారు. తమ ఆటలు సాగడం లేదని భావించారు.
తెలిసిన సీఐ సాయం తీసుకొని.. కిడ్నాప్ చేశారు. ఆనంద్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమలాపూర్కు చెందిన ఇసుక వ్యాపారిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు.. ఆనంద్ రెడ్డి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో పోలీసులు బిజీగా ఉన్నారు.
ఆనంద్ రెడ్డి మొబైల్ లోకేషన్ భూపాలపల్లి అడవీ దగ్గర ఆగిపోయింది. దీంతో సాండ్ మాఫియా ఆనంద్ రెడ్డిని కిడ్నాప్ చేసిందనడానికి మరింత బలం చేకూరింది. దీంతో ఆనంద్ రెడ్డి ఆచూకీ కనుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానిత ఇసుక వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఆనంద్ రెడ్డి ఆచూకీకి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఆనంద్ రెడ్డికి శత్రువులు ఎవరైనా ఉన్నారా..? ఉంటే వారితో శత్రుత్వం ఎలా ఉంది. ఎప్పటినుంచి వారు విరోధులు అనే అంశంపై ఆరాతీస్తున్నారు.