గర్వంగా ఉంది: నాయిని, కార్మికులకు ఉపాధి కల్పనే లక్ష్యం: దత్తన్న
హైదరాబాద్: కార్మికుల సంక్షేమంకోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో క్షిణాది రాష్ర్టాల కార్మికశాఖ మంత్రుల సమావేశం శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ సదస్సు జరుగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.
కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. కొత్తగా తెలంగాణలో వేజ్ బోర్డులను అమలు చేస్తున్నామని అన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సామాజిక భద్రతా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పిన నాయిని పరిశ్రమలకు నిరంతరం కరెంట్ను ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో ఇటీవలే ప్రారంభించిన కొత్త టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా కొత్త పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బంగారు తెలంగాణ సాధించే దిశగా ముందుకెళ్తున్నమని ఆయన పేర్కొన్నారు.
కార్మికులకు ఉపాధి కల్పనే తమ లక్ష్యం: దత్తన్న
కార్మికులకు ఉపాధి కల్పనే తమ లక్ష్యమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ఎంతో పాటుపడుతుందని, తెలంగాణలో కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కొనియాడారు.
శ్రమయేవ జయతే ద్వారా కార్మికులకు స్మార్ట్ కార్డులు ఇచ్చామని చెప్పిన దత్తాత్రేయ, శ్రమ సువిధ పోర్టల్ ద్వారా కార్మికులకు యూనిక్ నెంబర్ కేటాయించామని తెలిపారు.