వీడని సూర్యకుమారి మిస్సింగ్ మిస్టరీ: అర్ధరాత్రి ఇంటికొచ్చిందని విద్యాసాగర్
మాచవరంకు చెందిన వైద్యురాలు, కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి సోదరి అయిన సూర్యకుమారి అదృశ్యం కేసు మిస్టరీ వీడలేదు.
విజయవాడ: మాచవరంకు చెందిన వైద్యురాలు, కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి సోదరి అయిన సూర్యకుమారి అదృశ్యం కేసు మిస్టరీ వీడలేదు. ఐదురోజులు గడుస్తున్న ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన అనుమానితుడు ఉన్న విద్యాసాగర్ను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత అతడ్ని విడిచిపెట్టారు.
అర్ధరాత్రి ఇంటికొచ్చింది..
శుక్రవారం రాత్రి న్యాయవాది తానికొండ చిరంజీవి కార్యాలయంలో విద్యాసాగర్ మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. సూర్యకుమారి తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని చెప్పారు. జులై 31వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో సూర్యకుమారి తన ఇంటికి వచ్చిందని తెలిపారు. సుమారు పది నిమిషాలపాటు తన ఇంట్లో ఉన్న సూర్యకుమారి ముభావంగా కూర్చుందని చెప్పారు.
ఆ తర్వాత సూర్యకుమారి ఇంటికెళ్లా..
గత మూడు నెలలుగా పీజీమెట్ ప్రవేశపరీక్ష శిక్షణకు ఢిల్లీ వెళతానని పలుమార్లు చెప్పిందని పేర్కొన్నారు. తన ఇంటిలో సీసీ కెమేరాల్లో విజయవాడ వైపు వెళుతున్నట్లు ఆధారాలున్నాయని, వాటిని పోలీసులకు అందించానని చెప్పారు. ఆమె వెళ్లిన తర్వాత ఫోన్ ఇంటిలో మర్చిపోయిన విషయాన్ని గ్రహించానని, తర్వాత వెంటనే ఇచ్చేద్దామని క్రీస్తురాజపురంలోని సూర్యకుమారి ఇంటికి వెళ్లానని విద్యాసాగర్ వివరించారు.
వివాహేతర బంధం: ఐఏఎస్ అధికారి సోదరి అదృశ్యం, పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు
తనను నిందించడం సరికాదు..
ఆమె కుటుంబ సభ్యులు తానే ఏదో చేశామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా పోలీసులకు విచారణలో సహకరించానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని, ఆమె ఇంట్లో జరిగిన విషయాలు తనకు తెలియవని పేర్కొన్నారు. సూర్యకుమారి ఎక్కడికి వెళ్లిందో పోలీసులే కనిపెట్టాలని కోరారు. మరోవైపు సూర్యకుమారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లు, కాలువల లాకుల వద్ద వెతికామని చెప్పారు. ఏపీ 16సీహెచ్ 4576 వాహనం ఎక్కడ పెట్టిందన్నది తెలియడం లేదని, దాని ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు.
విద్యాసాగర్ను కఠినంగా శిక్షించాలి..
సూర్యకుమారి సెల్ఫోన్ సమాచారం ఆధారంగా పలు అనుమానిత నెంబర్ల నుంచి వివరాలను సేకరిస్తున్నాంమని తెలిపారు. కాగా, తన కూతురు అదృశ్యమవడానికి మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ కారణమని సూర్యకుమారి తండ్రి ఆరోపిస్తున్నారు. తన కూతురు అదృశ్యమైన రాత్రి విద్యాసాగర్ తమ ఇంటికి వచ్చి సూర్యకుమారి ఫోన్ ఇచ్చాడని, ఆమె తమ ఇంటికి వచ్చి సెల్ఫోన్ మర్చిపోయిందని చెప్పాడని ఆయన తెలిపారు. అప్పట్నుంచి తన కూతురు కనిపించడం లేదని వాపోయారు. నిందితుడైన విద్యాసాగర్ను కఠినంగా శిక్షించాలని సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్ కుమార్, మరియమ్మలు డిమాండ్ చేశారు.
ఇది ఇలా ఉండగా, సూర్యకుమారిని ఆమె తల్లిదండ్రులే దాచారన్న వార్తలు కూడా వస్తున్నాయి. వీటిపై వైద్యురాలి తల్లిదండ్రులు ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. తమ కుమార్తెను తామే దాచినట్టు నిరూపణ అయితే ఎటువంటి శిక్షకైనా సిద్ధమన్నారు.