ఆ సర్వేలతో సంబంధం లేదు, మెదక్లో పోటీ చేయమంటున్నారు: లగడపాటి, జగన్ మీద దాడిపై...
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో తన పేరు మీద వస్తోన్న సర్వేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బుధవారం అన్నారు. పార్టీలు కోరితే తాను ముందే సర్వే చేసి చెబుతానని ఆయన వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలయ్యాక మా సర్వే వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు సఫలమవుతుందా లేక విఫలమవుతుందా అనేది ప్రజలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.

మెదక్లో తెలంగాణలో పోటీ చేయమంటున్నారు
తెలంగాణలో అవకాశం వస్తే తాను తప్పక పోటీ చేస్తానని తాను ఇటీవల చెప్పానని లగడపాటి అన్నారు. తెలంగాణలో పోటీ చేయవచ్చు కదా అని అడిగిన సందర్భంలో అవకాశం వస్తే ఇక్కడ పోటీ చేస్తానని మాత్రమే చెప్పానని, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదని అన్నారు. మెదక్ వాళ్లు తనను తెలంగాణలో పోటీ చేయమని చెప్పారన్నారు.

భావోద్వేగాలను రాజకీయం చేయను
2014 నుంచి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని లగడపాటి చెప్పారు. ప్రజల భావోద్వేగాలతో ఎదగడానికి ప్రయత్నిస్తున్నానని అందరూ అనుకోబట్టే రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని చెప్పారు. ఆంధ్రా భావోద్వేగాలను తాను రాజకీయం చేయనని చెప్పారు.

జగన్ మీద దాడిపై లగడపాటి
విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడిని తాను ఖండిస్తున్నానని, ఇలాంటి భౌతిక దాడులు సరికాదని లగడపాటి చెప్పారు. ఎవరి మీద దాడి జరిగినా ఖండించాల్సిందే అన్నారు. ముఖ్యమంత్రి పైనా జరిగినా, ప్రతిపక్ష నేత పైన జరిగినా ఖండించాలన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రయత్నాలపై లగడపాటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, గతంలోను ఆయన పలు జాతీయ పార్టీలను కలిపారని చెప్పారు. ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలను కలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బీజేపీయేతర పార్టీలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications