టీ సర్కార్ కు గుదిబండగా మారబోతున్న భూ ప్రక్షాళన..
సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. భూప్రక్షాళన పేరుతో ఆమద్య నిర్వహించిన సర్వే అంతా రైతు శ్రేయస్సుకు అనుకూలంగా జరిగిందని, ఇక ప్రభుత్వ పరంగా తెలంగాణలో రైతులకు పూర్తి న్యాయం జరుగుతుందని కేసీఆర్ ఆకాంక్షిచారు. అదే అదనుగా అదికారులపై పెద్ద ఎత్తున భరోసా ఉంచారు. ఆ నమ్మకమే కొంపముంచే పరిస్థితికి తీసుకొచ్చింది. ఏ రైతుకు ఎంత భూమి ఉందో నిర్ధారించే ప్రక్రియ దేవుడెరుగు.. ఉన్న భూమిని రికార్డులనుండి తొలగించే పరిస్తితులు తలెత్తాయని రైతలు గొల్లు మంటున్నారు. అదికారుల తప్పిదాల వల్ల , యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి వల్ల భూప్రక్షాళన ప్రక్రియ అధ్వాన్నంగా తయారయ్యిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విమర్శలు రాను రాను అస్త్రాలుగా మారి ప్రభుత్వాన్ని గురి చూసే ప్రమాదం పొంచి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భూ ప్రక్షాళన విధానంలో లోపాలు..అదికారల నిలువెత్తు నిర్లక్ష్యం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసికుడు ! అయితే, ఆయన చేసే సాహసాలన్నీ సర్కస్ ఫీట్లను తలపిస్తుంటాయి. సీరియస్ గా జరగాల్సిన విషయాలు కూడా కామెడీగా మారిపోతుంటాయి. ఆదేశాలైతే గొప్పగా జారీ చేస్తారు... అమలు దానంతట అదే జరిగిపోతుందని అనుకుంటారయన. అంతే కాదు... తన ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో అద్భుతాలు జరిగిపోతున్నాయని భ్రమిస్తుంటారు. అందుకే కిందేం జరుగుతుందో లోతుల్లోకి వెళ్లి చూసే ప్రయత్నం చేయరు. కేసీఆర్ ఘనంగా చెప్పుకునే భూ రికార్డుల శుద్ధీకరణ విషయం ఇదే కోవలోకి వస్తుంది. తాను వేసిన ఆర్డర్ తో ఒక్క దెబ్బకు రాష్ట్రంలో భూములన్నీ ప్రక్షాళన అయిపోయాయని ఆయన సంబరపడుతున్నారు.

తప్పుల తడకగా భూరికార్డులు... తల పట్టుకుంటున్న భూస్వాములు..
భూమి లెక్కలన్నీ ఇక పక్కా అని నమ్మబలుకుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు ప్రధాన పత్రికల్లో ఆధారాలతో వార్తలు వస్తున్నాయి. భూ రికార్డులన్నీ తప్పుల తడకగా మారాయని చెబుతున్నారు. శుద్ధీకరణలో అనేక దోషాలు దొర్లాయంటున్నారు. ఒకరి భూమి మరొకరి ఖాతాలో చేరిన ఉదంతాలు ఉన్నాయట. ఉన్న భూమికంటే తక్కువ, ఎక్కువ లెక్కలు తేల్చారట. వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్టు కొత్త రికార్డుల్లో చూపారు. కొనుగోలు చేసిన భూమికి అనువంశికంగా సంక్రమించినట్టు పేర్కొన్నారు.

సవరణ అడిగితే శఠగోపం పెడుతున్న అదికారులు..
ఏదైతేనేమీ భూమి సొంతదారు పేరుతోనే ఉందిగా అనొచ్చు. కానీ, సమస్య ఇప్పుడు తెలియదు. భవిష్యత్ లో ఆ భూమి అమ్మాలన్నా, కొనాలన్నా అక్కడ ఇష్యూ మొదలవుతుంది. వారసత్వంగా వచ్చిన భూమికి, మరొకరి నుంచి కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పత్రాలు సరికూడాలి. అలా జరగపోతే... అమ్మకం, కొనుగోలు ప్రక్రియలో సరికొత్త తలనొప్పులు వస్తాయి. ఇలా తప్పులు దొర్లిన రికార్డులను స్థానిక రెవెన్యూ అధికారులను కలిసి సరి చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అది అంత తేలికైన విషయమా అన్నది ప్రశ్న. వీటిని సరి చేయించుకోవడం ఇప్పుడు రైతులకు తలకుమించిన భారంగా మారిందంటున్నారు. రికార్డుల సరీకరణ ఇప్పుడు అవినీతికి కొత్త దార్లను తెరిచిందట. స్థానిక రెవెన్యూ అధికారుల చేతులు తడపకపోతే పనయ్యే పరిస్థితి లేదట. అయిదు వేల రూపాయల నుంచి అవసరాన్ని బట్టి రూ. 50 వేల వరకు లంచాలు సమర్పించుకుంటే తప్ప రికార్డుల శుద్ధీకరణ జరగడం లేదని ఈ రోజు ఓ ప్రముఖ దినపత్రిక ఆధారాలతో సహా ప్రచురించింది.

ప్రక్షాళన భూములకు కాదు.. లంచాలకు మరిగిన అదికారులకు అంటున్న రైతులు..
వ్యవహారం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో భూ రికార్డుల శుద్ధీకరణే కేసీఆర్ సర్కారుకు గండంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో భూమిని ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. భూమి విషయంలో తేడా వస్తే తమ గౌరవానికి భంగం కలిగినట్టుగా ఫీలవుతారు. సెంటు భూమి అటూ ఇటైనా... సరిహద్దు విషయంలో లెక్కలు తప్పినా అసలే సహించరు. ఈ నేపథ్యంలో రికార్డులే తప్పుల తడకగా మారితే... ఇంకేముంటుంది ? దానికి తోడు రికార్డుల పునర్ శుద్ధీకరణకు లంచాలు కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిదంటే...దీంతో అంతిమంగా టీఆర్ఎస్ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications