అక్రమ సంబంధాన్ని తల్లి నిలదీసిందనే కక్షతో లాస్యను పొట్టన పెట్టుకున్నారు
హైదరాబాద్: హైదరాబాదులోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీన్ దయాళ్ నగర్లో జరిగిన చిన్నారి లాస్య హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 14న లాస్య హత్యకు గురైతే, ఆ విషయం 17న వెలుగు చూసిన విషయం తెలిసిందే. లాస్య హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
పక్కింటి మహిళ వివాహేతర సంబంధాన్ని చిన్నారి లాస్య తల్లి నిలదీసిందనందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీన్దయాళ్నగర్లో నవీన్చారి, మయూరి దంపతులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వీరికి లాస్య (4)తో పాటు 3 నెలల బాబు ఉన్నాడు. వీరి ఇంటికి ఒకవైపు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగించే లక్ష్మయ్య, యాదమ్మ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి కుమారుడు సహా కుమార్తె పద్మ (30) ఉన్నారు.
పద్మ భర్త చనిపోవడంతో తలిదండ్రుల వద్దే ఉంటోంది. బాధిత కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి మరో వైపు ఇంటిని బోరబండలో ఉండే గిరి అనే వ్యక్తి నిర్మించుకున్నాడు. కొంత కాలంగా పద్మతో గిరికి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. వీరి వ్యవహారం లాస్య తల్లి మయూరి కంటపడింది. దీంతో మర్యాదస్తుల కుటుంబాలు నివాసముండే ఇక్కడ ఇటువంటి వ్యవహారాలేమిటంటూ నిలదీసింది.

దీంతో మయూరిపై పద్మ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. దాంతో గిరి సహాయంతో మయూరి కుటుంబానికి ప్రశాంతత లేకుండా చేయాలని పథకం వేసుకున్నారు. తమ పథకం అమలుకు లక్ష్మయ్య కుటుంబ సభ్యులు తమ ఇంటి పక్కనే ఉండే నర్సయ్య, ఇందిరమ్మల సహాయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో బస్తీలో మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ చేపట్టారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన లాస్య ఇంటి ముందు ఆడుకుంటోంది. ఫాగింగ్ అయిపోయిన తరువాత యాదమ్మ లాస్య దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న వ్యక్తులచే లాస్యను మంచం కింద బలవంతంగా పడుకోబెట్టి దిండుతో ముఖంపై బలంగా అదిమి పిరాడనీయకుండా చేసి హత్య చేశారు.

శవాన్ని ఇతర ప్రదేశానికి తరలిద్దామని అనుకునిఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టారు. జనసమ్మర్థం వల్ల వీలు కాకపోవడంతో శవాన్ని ముక్కలుగా కోసి తరలించాలని నిర్ణయించుకుని కత్తిపీటతో గొంతును కోశారు. వెంటనే శవాన్ని బ్యాగులో కట్టి వంటింట్లోని స్టవ్ పెట్టుకునే బండ కింద బియ్యం సంచి పక్కనే భద్రపర్చారు.
మూడురోజుల పాటు లాస్య మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా పద్మ కుటుంబ సభ్యులు స్ప్రేలు చల్లారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దుర్వాసన అధికం కావడంతో అందరికి అనుమానాలు తలెత్తాయి. బస్తీకి చెందిన పలువురు పద్మ ఇంటికి వచ్చి దుర్వాసన వస్తోందంటూ చెబుతుంటే అలాంటిదేమీ లేదంటూ వారిని పంపేశారు.
అయినా దుర్వాసన అదే విధంగా వస్తుండడంతో తలుపులు తీయాలని లోపలికి వస్తామని చెబుతుంటే అర్ధగంట వరకు ఇంటి తలుపులు తీయకుండా గడియ పెట్టుకున్నారు. చివరికి చేసేది లేక తప్పని పరిస్ధితుల్లో తలుపులు తెరవడంతో విషయం వెలుగు చూసింది. ఎనిమిదేళ్ళ పద్మ కుమారుడు, కుమార్తెలు జరిగిన విషయాన్ని, తమను బెదిరించిన తీరును బస్తీ వాసులకు తెలిపారు. దీంతో బస్తీవాసులు నిందితులపై దాడులకు దిగడంతో వారికి గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications