దాసరిపై లక్ష్మీపార్వతి, జగన్ దిగ్భ్రాంతి, ఎప్పటికీ గుర్తుంటారు: కేసీఆర్
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మృతి విషయం తెలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మృతి విషయం తెలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సలహాలిచ్చారు: దాసరిపై సోనియా గాంధీ, 'అమ్మ' కోరిక నెరవేరకుండానే..
దాసరి మృతి పట్ల జగన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ చాంబర్లో ఆయన పార్థివదేహం ఉంది.
దాసరిలో అభ్యుదయ భావాలు..: లక్ష్మీపార్వతి
వైసిపి నాయకులు లక్ష్మీపార్వతి, రోజా, తెరాస నాయకులు డి శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లతో దాసరి గొప్ప సినిమాలు తీశారని లక్ష్మీపార్వతి అన్నారు. దాసరిలో అభ్యుదయ భావాలు ఎక్కువ అన్నారు.
ఓ చరిత్ర ముగిసింది: మోహన్ బాబు
దాసరి మృతితో ఒక చరిత్ర ముగిసిందని మోహన్ బాబు అన్నారు. దాసరితో అనుబంధం మరువలేనిదని బాలకృష్ణ అన్నారు. దాసరి ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
జన్మభూమికి స్ఫూర్తివంత పాటలు రాశారు: చంద్రబాబు
జన్మభూమికి దాసరి నారాయణ రావు స్ఫూర్తిమంత పాటలు రాశారని ఏపీ సీఎంచంద్రబాబు అన్నారు. సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఎప్పటికీ గుర్తుంటారు: కేసీఆర్
దాసరి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో దాసరి తనదైన విశిష్ట ముద్ర వేశారన్నారు. సినీరంగంలో ఎంతో మందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమయ్యారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడంలో దాసరి కృషి ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. దాసరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉన్నతస్థాయిలో రాణించారు
దాసరి నారాయణరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దాసరి మరణం ఆయన కుటుంబానికే కాక సినీ, రాజకీయ రంగాలకు కూడా తీరని లోటని మాజీ గవర్నర్ కే రోశయ్య అన్నారు. ఎంచుకున్న ఏ రంగంలోనైనా ఆయన ఉన్నత స్థాయిలో రాణించారన్నారు. దాసరి సినీ పరిశ్రమకు తీరని లోటు అని బిజెపి నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చేవారన్నారు.
చెరగని ముద్ర వేశారు
దాసరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 151 సినిమాల ద్వారా ప్రేక్షకుల మదిలో దాసరి చెరగని ముద్రవేశారన్నారు. రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ దాసరి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ 2004 ఎన్నికల్లో దాసరితో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు.