ఓడించారుగా .. నా డబ్బులు నాకిచ్చేయండి : నగదు వసూల్ చేస్తున్న కాంగ్రెస్ నేత
మంచిర్యాల : ఓటు .. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. తమ నేతను ప్రజలు ఎన్నుకునే ప్రక్రియ. తమ సాధక బాదకాలను పరిష్కరించే నేతను ఓటర్లు పట్టం కడతారు. కానీ పరిస్థితి మారింది. ఓట్ల పండగ అంటే డబ్బులు పంచడమే. ఇక్కడ జనాలు కూడా అలానే తయారయ్యారు. డబ్బులు తీసుకొని .. ఎవరికీ వేయాలో వారికే వేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఎంపీటీసీగా పోటీచేసి .. ఓడిపోయారు. ఆయన ఏం చేశారు చుద్దాం.
ఇచ్చిన డబ్బులు వసూల్ ..
ఇటీవల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లాలో కూడా ఓటింగ్ ముగిసి ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యింది. కానీ జన్నారం మండలం లింగయ్యపల్లెలో మాత్రం వింత జరిగింది. ఎందుకంటే అక్కడినుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ క్యాండెట్ మదాడి హన్మంతరావు ఓడిపోయారు. ఓడిపోతే వింతే లేదు .. కానీ ఆయన పంచిన డబ్బులను తిరిగి ఇవ్వమని ప్రజలను అడుగుతున్నారు. ఇదే వింత. గతంలో కొన్ని ఘటనలు జరిగినా .. ఈసారి మాత్రం మిగతావారు ఆశ్చర్యపోతున్నారు. గెలిచేందుకు లక్షలు పంచానని .. తన డబ్బును తనకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. జనం కూడా సానుభూతితో ఆయన పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఐటీ శాఖ ఏం చేయనుంది ?
ఎన్నికల సమయంలో డేగా కన్నుతో పరిశీలించిన ఐటీ శాఖ ఈ ఘటనను ఏం చేయనుందోననే సందేహం తలెత్తుంది. సాధారణంగా ఎంపీటీసీ కోసం నగదు ఖర్చు కోసం ఈసీ పరిమితి పెట్టింది. కానీ లక్షలు లక్షలు వసూల్ చేయడంతో ఐటీ శాఖ ఏం చేయనుందో అనే చర్చ మొదలైంది. ఒకవేళ ఐటీ శాఖ స్పందిస్తే .. హన్మంతరావు నగదు గురించి పూర్తి వివరాలు అడిగే అవకాశం ఉంది. ఇంత డబ్బు ఎక్కడిది ? ఎలా సంపాదించారు ? ఆధారాలు ఉన్నాయా ? పత్రాలు చూపించాలని కోరే అవకాశం ఉంది. మీడియాలో వార్తలు వస్తున్న ఐటీ శాఖ ఏం చేయనుందో చూడాలి మరి.
కారు జోరు .. ప్రభ కోల్పోతున్న హస్తం
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోగించింది. మెజార్టీ ఎంపీపీ సీట్లను కైవసం చేసుకుంది. కొన్నిజిల్లాల్లో క్వీన్ స్విప్ చేసింది. ఇటు జెడ్పీ చైర్మన్ల పీఠంపై కూడా గులాబీ జెండా ఎగిరింది. అయితే విపక్ష కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కూడా రెండోస్థానానికే పరిమితమైంది. మొక్కుబడిగా ఎంపీసీ సీట్లను గెలుచుకుంది. బీజేపీ తన ఓటు షేర్ పెంచుకుంది .. కానీ కాంగ్రెస్ పార్టీ మరింత ఓటుబ్యాంకు కోల్పోయింది. ఈ క్రమంలోనే లింగయ్యపాలెం కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి హన్మంతరావు కూడా ఓడిపోయారు. తాను ఓడిపోయాననే నైరాశ్యంలోనే తాను పంచిన డబ్బులివ్వమని అడుగుతున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. ఒకప్పుడు అధికారం చేపట్టి .. కీ రోల్ షోపించిన కాంగ్రెస్ ఇప్పుడు ... బీజేపీ తర్వాతి స్థానానికి పడిపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడని విషయం.