తెలుగులో 99కి బదులు '0' మార్కులు .. లెక్చరర్ విధుల నుండి తొలగింపు , 5 వేల జరిమానా
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించినట్టు తెలిపారు విద్యాశాఖా కార్యదర్శి జనార్ధన్ రెడ్డి. ఇంటర్ ఫలితాల అవకతవకలకు టెక్నికల్ సమస్యలే కాకుండా జవాబు పత్రాల మూల్యాంకనం చేసిన లెక్చరర్ల తప్పిదం కూడా కారణం అని గుర్తించారు. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల అవకతవకలపై చర్యలు ప్రారంభమయ్యాయి . ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. శ్రీనారాయణ జూనియర్ కాలేజిలో తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న లెక్చరర్ 99 మార్కులకు బదులుగా సున్నా మార్కులు వేశారు . దీంతో ఆమెను విధుల నుంచి తొలగిస్తూ శ్రీనారాయణ జూనియర్ కాలేజి నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా, ఇంటర్ బోర్డు ఆ అధ్యాపకురాలికి రూ.5000 జరిమానా విధించింది. ఆ జరిమానాను సదరు లెక్చరర్ వెంటనే చెల్లించినట్టు తెలుస్తుంది.
పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేసిన లెక్చరర్ తో పాటు స్క్రూటినైజర్ విజయ్ కుమార్ పైనా సస్పెన్షన్ వేటు పడింది. నవ్యకు తెలుగు సబ్జెక్టులో 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వేయటంతో ఈనిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇంత దారుణమైన తప్పిదాలు చేసిన లెక్చరర్లపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.