మెగా అభిమానుల్లో టెన్షన్:సైరా విడుదల ఆరోజు ఖాయమేనా..రంగంలోకి చిరు ఫ్యామిలి
హైదరాబాద్ : విడుదలకు ముందే మెగస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. చిత్రం విడుదలను ఆపాలంటూ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
టైటిల్తో ప్రారంభమైన వివాదం
సైరా నరసింహారెడ్డి... మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం. అత్యంత భారీ బడ్జెట్తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దీన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభం నుంచే వివాదాలు వెంటాడుతున్నాయి. ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్తోనే ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. తప్పని పరిస్థితుల్లో టైటిల్లో ఉయ్యాలవాడ అనే పదాన్ని తొలగించి సైరా అనే పదాన్ని చేర్చింది చిత్ర యూనిట్.
తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఇక కొద్ది రోజుల నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఈ చిత్రం విడుదలపై పోరాటం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అంతకుముందు చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక తాజాగా ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ, విడుదలకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరాదంటూ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దొరవారి దస్తగిరి రెడ్డితో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇళ్లును, ఇతర వస్తువులను వాడుకున్నారు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకుని చిత్రం తీసేందుకు గాను నిర్మాత రాంచరణ్ తమకు డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చి తమను మోసం చేశారంటూ తమ పిటిషన్లో పేర్కొన్నారు. చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో పాటు ఇళ్లు, ఇతర వస్తువులను కూడా చిత్రం కోసం వినియోగించుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు ట్రైలర్ విడుదలకు ముందే డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
రూ.20 కోట్లు ఇస్తామని..రూ.25వేలు ఇచ్చారు
గతేడాది ఆగష్టు 20న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులంతా మొత్తం 22 మంది చిత్ర నిర్మాత రాంచరణ్ను తన నివాసంలో కలిసినట్లు పేర్కొన్నారు. అయితే చిత్రం బడ్జెట్ మొత్తం మీద 10శాతం చెల్లిస్తానని నాడు రాంచరణ్ హామీ ఇచ్చాడని అయితే దీనిపై ఎలాంటి ఒప్పందం కానీ డాక్యుమెంట్లు కానీ లేవని స్పష్టం చేశారు. కేవలం మాట ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సినిమా బడ్జెట్ రూ.200 కాగా, అందులో 10 శాతం అంటే రూ. 20 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే నరసింహారెడ్డి వారసులకు రూ. 25వేలు దారి ఖర్చుల కింద ఇచ్చి చేతులు దులుపుకున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు.
1952 సినిమాటోగ్రఫీ చట్టం ఏం చెబుతోంది..?
ఆ తర్వాత రాంచరణ్ను లేదా చిరంజీవిని కలిసేందుకు వెళ్లగా పోలీసులను పెట్టించి బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.మళ్లీ ఇంకోసారి ఇక్కడి కనిపిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని బెదిరించినట్లు వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. 1952 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఒకరి బయోపిక్ తీయాలంటే తప్పనిసరిగా వారి వారసుల అనుమతి పొందాలని ఉందని కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పిటిషన్లో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్, సీబీఎఫ్సీ ఛైర్పర్సన్, నిర్మాత రాంచరణ్, దర్శకుడు సురేంద్రరెడ్డి, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఇతరులను ప్రతివాదులుగా చేర్చారు.
మొత్తానికి సైరా నరసింహారెడ్డి చిత్రంపై దాఖలైన పిటిషన్ పట్ల హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. గతంలో కూడా రాంచరణ్ నటించిన ఇండస్ట్రీ హిట్... మగధీర చిత్రంలో కూడా ఏం పిల్లడో వెళ్దం వస్తవా అనే పాటపై కూడా కాస్త వివాదం అలుముకుంది. అప్పట్లో ఆపాట తనదంటూ ప్రజాగాయకుడు వంగపండు చెప్పారు.