తెలంగాణాలో ఈడీ, ఐటీ దాడులకు లిస్ట్ రెడీ.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే? గులాబీల గుబులు!!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న సోదాలు గులాబీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కొక్కరుగా మంత్రులను టార్గెట్ చేసి ఈడీ, ఐటి దాడులతో వణుకు పుట్టిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉన్న, సీఎం కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్న మరికొందరు రాజకీయ నాయకులను ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వారందరూ ఇప్పటినుంచే ఒకవేళ తమ పై దాడి జరిగితే తప్పించుకోవడం ఎలా? తట్టుకోవడం ఎలా అన్నదానిపై దృష్టి సారించినట్లు సమాచారం.
తెలంగాణాలో కేసీఆర్ ఆర్దిక మూలాలపై ఈడీ, ఐటీ ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 11 మందిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫోకస్ చేసినట్లుగా సమాచారం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత మంది నాయకులు, ఎంత డబ్బులు సంపాదించారు.
వేల కోట్ల వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు? సీఎం కేసీఆర్ ఆర్ధిక మూలాలు ఎక్కడ ఉన్నాయి? వంటి అన్ని సమాచారాలను సేకరించిన ఈడీ, ఐటి, సిబిఐ దర్యాప్తు బృందాలు వారిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. ఇక వీరి వ్యవహారాల్లో ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించి, వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థల నెక్స్ట్ టార్గెట్ వీళ్ళేనా?
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో క్యాసినో వ్యవహారంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్, ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి ని టార్గెట్ చేసి దాడులు చేసి దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందు ముందు మరో 9 మందిపై నజర్ పెట్టినట్లు తెలుస్తుంది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఇక ఆర్థికంగా ఓ రేంజ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులపై కేంద్ర దర్యాప్తు బృందాలు దాడులు చేస్తాయని భావిస్తున్నారు.
ఫిర్యాదులు చేయించి దాడులు చేసే ప్లాన్ లో బీజేపీ
బోలెడంత అక్రమార్జన చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి, దాడులు చేయించే ప్లాన్లో బిజెపి ఉన్నట్టు తెలుస్తుంది . టిఆర్ఎస్ ను రాజకీయంగా చావుదెబ్బ కొట్టాలనే వ్యూహంతో వారిపై ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టించి, ఒత్తిడి పెంచడానికి బిజెపి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం తో మొదలైన ఈ తనిఖీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఉదృతంగా కొనసాగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.
ముంచుకొస్తున్న ముప్పు.. అందరిలో ఆందోళన
చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం, గ్రానైట్ వ్యవహారం, ఆదాయపు పన్ను శాఖకు పన్నులు సరిగా చెల్లించని వ్యవహారాలతో రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల దూకుడు కనిపిస్తుంది. ఏది ఏమైనా తాజా పరిణామాలతో అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన టిఆర్ఎస్ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడు ముంచుకొస్తున్న ఈ ముప్పును ఎలా తప్పించుకోవాలి అని టిఆర్ఎస్ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. బయటకి తాము భయపడబోమని చెబుతున్నప్పటికీ కెసిఆర్ తో సహా అందరు నేతలు అంతర్మథనంలో పడ్డారు.