కేసీఆర్ సారు.. ఇదీ మీ ఫెయిల్యూర్ లెక్క: జవాబు ఉందా?
చైతన్యవంతులైన తెలంగాణ యువత సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలదీస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను లెక్కగట్టి మరీ కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసురుతోంది
హైదరాబాద్: ఓవైపు ప్లీనరీ.. మరోవైపు వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించుకోవడానికి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఈ సందర్బంగా అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఆ పార్టీ సాధించిన విజయాలెన్ని? అపజయాలెన్ని? అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.
ఒకప్పటి ఉద్యమ పార్టీ పాలనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సాగుతుందా? ప్రజాభిప్రాయాన్ని కేసీఆర్ సర్కార్ అసలు పరిగణలోకి తీసుకుంటుందా? తప్పులేంటి!, ఒప్పులేంటి?.. రాజకీయ పార్టీగా ఇప్పుడీ చర్చ టీఆర్ఎస్కు అవసరమైనా లేకపోయినా.. ఒకప్పటి ఎడ్డి తెలంగాణలా కాకుండా.. సోయికొచ్చిన తెలంగాణగా.. రాష్ట్రం ఇప్పుడు తనను తాను సమీక్షించుకుంటుంది.
పత్రికా ప్రకటనల్లో.. ప్రెస్ మీట్లలో నాయకులు చెబుతున్న మాటలకు వాస్తవ రూపానికి ఎంతమేర పొత్తు కుదురుతోంది. చైతన్యవంతులైన తెలంగాణ యువత సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలదీస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను లెక్కగట్టి మరీ కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసురుతోంది.
ఫస్ట్ ఫెయిల్యూర్ 'ఫాస్ట్':
అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన పథకం ఫాస్ట్. తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం దీన్ని రూపొందించగా.. హైకోర్టు దీన్ని కొట్టివేయడంతో ప్రభుత్వ తొలి వైఫల్యం నమోదైంది. ఇక్కడి నుంచి ఇక పరంపర కొనసాగుతూనే ఉంది.
ఎంసెట్ మరో ఫెయిల్యూర్:
ఎంసెట్ పేపర్ లీకేజీతో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందో లేక అధికారులే అలసత్వం వహించారో తెలియదు గానీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో పెద్ద చెలగాటమే జరిగింది. ఏకంగా మూడుసార్లు ఎంసెట్ పరీక్షను నిర్వహించి ప్రభుత్వం తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంది. ఆఖరికి లీకు వీరులను పట్టుకోవడంలోను ప్రభుత్వం వైఫల్యం చెందింది.
గ్రూప్-1 ఫలితాలేవి?:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ప్రత్యేకంగా మరోసారి గ్రూప్-1 నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకేసారి గ్రూప్-1 నిర్వహించాయి. ఏపీ గ్రూప్-1 ఫలితాలు మాత్రం అప్పుడే విడుదలవగా.. తెలంగాణలో మాత్రం పరీక్ష నిర్వహించి 6నెలలు పూర్తయినా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు.
గ్రూప్-2 కూడా అంతే సంగతి:
గ్రూప్-1తో పోల్చితే గ్రూప్-2 పరీక్షది మరింత దారుణమైన పరిస్థితి. పరీక్షలను తొలుత వాయిదా వేసిన ప్రభుత్వం ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారా గతేడాది నవంబర్ లో పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత 80రోజుల్లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇప్పటికీ నాలుగు నెలలు గడిచిపోయింది గానీ ప్రభుత్వం మాత్రం దాని గురించి పట్టడం లేదు. దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తుండటంతో ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితి.
డీఎస్సీ నోటిఫికేషన్ ఏది?:
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులది ధీన గాథ. బిఎడ్ పరీక్షలను ఆలస్యంగా నిర్వహించడమే గాక, టిపిటీ, హెచ్.పి.టి లాంటి పరీక్షలను ఒక సంవత్సరం పాటు రద్దు చేసింది. మరి దీనికి కారణాలేమైనా చెప్పిందా? అంటే అదీ లేదు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ కు ఇప్పటికీ దిక్కు లేదు.
'గురుకుల' టీచర్ పోస్టులది అదే కథ:
ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయగానే మార్కులకు సంబంధించిన నిబంధనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఓ మెట్టు దిగివచ్చిన ప్రభుత్వం అందుకు సరేనంది. కానీ దానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు.
పోలీస్ రిక్రూట్ మెంట్ కూడా అంతే:
భారీ స్థాయిలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే పరీక్షలు నిర్వహించింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అనుమానాలు తలెత్తడంతో ఇప్పుడీ కేసు కోర్టులో నలుగుతోంది. దీంతో ఫలితాలు ప్రకటించినా.. భర్తీ ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది. ఈ భర్తీ ప్రక్రియ ఎప్పుడు ముందుకు కదులుతుందో చెప్పలేని పరిస్థితి.
సింగరేణిలోను ప్రభుత్వం ఫెయిల్యూర్:
వారసత్వ ఉద్యోగాల రూపకల్పన చేస్తామంటూ హామి ఇచ్చిన టీఆర్ఎస్ సర్కార్ అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. తీరా కార్మికులంతా సంబరాల్లో మునిగిపోయిన తరుణంలో.. హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలవడంతో ఈ ప్రక్రియ కూడా అర్థారంతరంగా నిలిచిపోయింది.
వారసత్వంపై గంపెడాశలు పెట్టుకున్న సింగరేణి ఉద్యోగుల కుటుంబాలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నాయి. ఉద్యమ సమయంలో దాదాపు నెలన్నర రోజుల పాటు సమ్మె నిర్వహించి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికుల పాత్ర అత్యంత కీలకమైనది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారసత్వం దక్కుతుందనుకున్న వారంతా ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. టీఆర్ఎస్ జాబితాలో ఇదో అతిపెద్ద ఫెయిల్యూర్.
10వ తరగతి పేపర్ కూడా లీక్:
ఉమ్మడి రాష్ట్రంలోను జరగని లీకేజీలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో చోటు చేసుకోవడం మరో దారుణం. ఇన్ని ఫెయిల్యూర్లను మూటగట్టుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. బంగారు తెలంగాణ అని మాటలు చెప్పడం మభ్య పెట్టడమే తప్ప మరొకటి కాదనేది చాలా బలంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇంత దారుణమైన పాలనతో ప్రజలను మోసపుచ్చడాన్ని తెలంగాణ యువత నిర్ద్వంద్వంగా ఎండగడుతోంది.
ఇన్ని లొసుగులు, ఇన్ని ఫెయిల్యూర్లు.. ఎటుపోతుంది తెలంగాణ? ఇదేనా చైతన్య తెలంగాణ.. ఇదేనా బంగారు తెలంగాణ? వట్టి మాటలు విని మోసపోయేందుకేనా తెలంగాణ సాధించుకున్నది? అని సోషల్ మీడియాలో జనం తీవ్రస్థాయిలో విమర్శిస్తుండటం.. ఇప్పటికైనా ప్రభుత్వ చెవలకెక్కుతుందా!.. చూడాలె..