మోగిన స్థానిక నగారా : మూడు విడతల్లో పోలింగ్, ఒక జెడ్పీ, 40 ఎంపీటీసీలకు నో ఓటింగ్ : నాగిరెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల నగారా మోగింది. 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈసారి ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసే వెసులుబాటును కల్పించారు.
ఆన్లైన్లో నామినేషన్ ..?
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేయవచ్చని పేర్కొంది. కానీ తర్వాత తమ నామినేసన్ హార్డ్ కాపీలను రిటర్నింగ్ అధికారికి కచ్చితంగా సమర్పించాలని నిబంధన విధించింది. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలవడంతో నేటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.
మూడుదశల్లో పోలింగ్
రాష్ట్రంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మూడుదశల్లో పోలింగ్ నిర్వహిస్తామని నాగిరెడ్డి తెలిపారు. తొలి విడత మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. మే 27న తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం 5857 ఎంపీటీసీలు ఉండగా కోర్టు కేసుల వల్ల 40 చోట్ల ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. 5817 ఎంపీటీసీలకు మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మొదటిదశలో 2186, రెండో విడత 1913, మూడో విడత 1738 చోట్ల పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 539 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. మండపేట స్థానానికి కోర్టు కేసు వల్ల పోలింగ్ నిర్వహించడం లేదని చెప్పారు. 197 స్థానాలకు తొలివిడత, 180 చోట్ల రెండో విడత, 161 స్థానాలకు చివరి విడత ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయొచ్చని .. కానీ గెలిచాక ఎదో ఒక పదవీకి రాజీనామా చేయాలని పేర్కొన్నారు.
ఇదీ వ్యయం
జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల వ్యయంపై క్లారిటీ ఇచ్చారు నాగిరెడ్డి. జెడ్పీటీసీ అభ్యర్థి గరిష్టంగా 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.లక్ష వరకు ప్రచారం కోసం ఖర్చు చేయొచ్చని స్పష్టంచేశారు. అంతకుమించి వ్యయం ఉండకూడదని స్పష్టంచేశారు.
పోలింగ్ తర్వాత ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నిక
ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం తర్వాత నోటిఫికేషన్ జారీచేస్తామని నాగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తామని నాగిరెడ్డి పేర్కొన్నారు. పోలిగ్ కోసం లక్షా 47 వేల మంది సిబ్బంది సేవలు అవసరమవుతాయని చెప్పారు. మూడు దశల్లో 50 వేల మంది చొప్పున సేవలు వినియోగిస్తామని చెప్పారు. 26 వేల మంది పోలీసులతో భద్రతా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 32 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని .. ఒక్కో దఫా 11 వేల పోలింగ్ స్టేషన్ల ఎన్నికలకు సంబంధించి 11 వేల మంది భద్రతా సిబ్బంది సేవలను తీసుకుంటామని వివరించారు.