మిడతల దాడి: తెలంగాణలో హైఅలర్ట్.. కేసీఆర్ హైలెవల్ మీటింగ్.. లాక్డౌన్పైనా కీలక నిర్ణయం..
వాటి వేగం.. గంటలకు 15 కిలోమీటర్లు. ప్రస్తుతం మనకున్న దూరం 400 కిలోమీటర్లు. ఇప్పుడు దండయాత్ర సాగిస్తోన్న దిశను మార్చుకోకుంటే.. మరో 27 గంటల్లో.. రాకాసి మిడతల దండు తెలంగాణపై దాడి చేయడం ఖాయం. పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. ఈ కటకాల గుంపు తెలంగాణవైపునకే దూసుకొచ్చే అవకాశాలుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
Recommended Video

ఆ జిల్లాల్లో హైఅలర్ట్..
మిడతల దాడి నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి.. మహారాష్ట్ర అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపుతున్నారు. మిడతల దండు రాష్ట్ర సరిహద్దుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉందని, అవి రాష్ట్రంలోకి ప్రవేశించేది లేనిది మరికొద్ది గంటల్లో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డిలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలిసింది.

ఎదురుదాడికి సిద్ధం కండి..
మహారాష్ట్రలోనూ వ్యవసాయ అధికారులు.. మిడతల్ని పారద్రోలేందుకు చర్యలు చేపట్టినా, వాటి ప్రభావం తక్కువగా ఉందని, రాకాసి దండు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తోంది. దీనిపై వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి.. సరిహద్దు జిల్లాల అధికారులు, కీటకాలను పారదోలడంలో నిపుణులైనవారితో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మిడతలు దాడి చేసే అవకాశమున్న జిల్లాల్లో యంత్రాంగం, రైతులు.. రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు జనార్థర్ రెడ్డి సూచించారు.

సాగుపై సీఎం రివ్యూ..
నియంత్రిత పంటలసాగు విధానాన్ని అమలు చేస్తామంటోన్న సీఎం కేసీఆర్.. ఆ మేరకు రైతులను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం హైలెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో వానకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేలా అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు. ముంచుకొస్తున్న మిడతల ముప్పు గురించి కూడా అధికారులకు ఆయనకు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.

మరిన్ని సడలింపులు?
నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31న ముగియనుండటంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. సాగుతోపాటు కరోనా స్థితిగతులు, లాక్ డౌన్ ఎగ్జిట్ పైనా సీఎం కేసీఆర్ రివ్యూ చేపట్టారు. లాక్ డౌన్ 4.0లో సడలింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. పరిమితంగా రైళ్లు, విమానాల రాకపోకలు సాగుతున్నాయి. సినిమాల షూటింగులు జూన్ నుంచి సాగనున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో హైదరాబాద్లో సిటీ బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లకు అనుమతిపైనా సమాలోచనలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications