బండి సంజయ్ ఫిర్యాదు: సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ సహా పలువురికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
హైదరాబాద్: దౌర్జన్యం చేసి తనను అరెస్టు చేశారంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన ఫిర్యాదుపై తెలంగాణ సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్ స్పెక్టర్లకు కూడా లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
317 జీవోను రద్దు చేయాలని ఉద్యోగ దీక్ష చేసిన సమయంలో పోలీసులు బండి సంజయ్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. శుక్రవారం లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్లో జరిగిన వివరాలను తెలిపారు.
తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును బండి సంజయ్ వివరించారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారని, పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని కమిటీకి బండి సంజయ్ వివరించారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని తెలిపారు. సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ అధికారులకు నోటీసులు పంపింది.
ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ సభ్యుడి కార్యాలయంపైన, ఎంపీపైన దాడి చేసిన తీరుపై బండి సంజయ్ సమర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ.. ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేసి బండి సంజయ్ను అరెస్టు చేయడంపై సీరీయస్ అయింది.
బండి సంజయ్ వాదనలు విన్న కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. రాష్ట్ర హైకోర్టు సైతం తనపై దాడిని, అరెస్టును తీవ్రంగా తప్పుపట్టిన విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు. తనపై రెండోసారి దాడి జరిగిన విషయాన్ని సైతం ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ వివరించారు. తన పై, ఎంపీ కార్యాలయం పై దాడి చేసిన మరికొందరి పోలీస్ అధికారుల పేర్లను ప్రివిలేజ్ కమిటీకి తెలిపారు బండి సంజయ్.
Recommended Video
సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో పాటు, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, జమ్మికుంట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్రావు, హుజూరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ వీ.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె. శ్రీనివాస రావు, కరీంనగర్ ఐ-టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ చలమల్ల నటేష్లకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది.