కమలం వాడిపోక తప్పదు..! కాంగ్రెస్ కథ ముగిసినట్టే..! అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!!
హైదరాబాద్ : ఎంపీ ఒవైసీ రెండు జాతీయ పార్టీలను విమర్శించారు. కేంద్రలో బీజేపి గానీ, కాంగ్రెస్ గానీ అదికారంలోకి రావని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు. మహిళా సంరక్షణ బీజేపీతోనే అనడం అబద్ధమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ అన్నారు. జేఎన్యూలో మహిళలపై ఏబీవీపీ దాడులు చేసి రెండేళ్లు గడిచిన బీజేపీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారని..
ఐదేళ్ల కాలంలో ఎందుకు చేయలేదని ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 370ని తొలగించలేరని అన్నారు. యూనిఫార్మ్ సివిల్ కోడ్ తెస్తామని చెప్పారని.. దానికి లా కమిషన్ ఒప్పుకోలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మాబ్ లించింగ్స్ ఎక్కువగా పెరిగాయన్నారు.
హిందుస్తాన్లో భిన్నత్వాన్ని బీజేపీ ఒప్పుకోవడంలేదని, 2014లో ఇచ్చిన వాగ్దానాలు అచ్చేదిన్, నోట్లరద్దు అన్ని ఫెయిల్ అయ్యాయని చెప్పారు. తెలంగాణ ప్రజలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే.. మోదీ పక్కన పెట్టారని విమర్శించారు. అగ్రవర్ణలకు పదిశాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేశారు.
కేంద్రంలో వచ్చేది బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలేనని.. అప్పుడు 12శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్కు 16 సీట్లు, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి 21 ఎంపీ స్థానాలు, 130 ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఖాయమన్నారు.