అన్నాచెల్లెల మధ్య ప్రేమ, పెళ్లి కోసం పెద్దలపై ఒత్తిడి, కాదనడంతో బలవన్మరణం..
వాళ్లిద్దరూ వరసగా అన్నా చెల్లెళ్లు అవుతారు. కానీ కలిసి చదువుకోవడంతో, సాన్నిహిత్యం ఏర్పడింది. మనసులు కలవడంతో ప్రేమ చిగురించింది. ఆ సమయంలో తమ వరస వారికి గుర్తుకురాలేదు. పెళ్లి చేసుకోవాలని భావించి.. ఇంట్లో తమ విషయం చెప్పారు. కానీ కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. ప్రేమ లేదు, గిమ లేదు అని తెగేసి చెప్పారు. దీంతో తాము జీవితం పంచుకోలేమని భావించిన ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.

డిగ్రీ చేస్తూ..
వికారాబాద్ జిల్లా కొమునిపల్లికి చెందిన ప్రశాంత్, మమత డిగ్రీ చదువుతున్నారు. వరసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. రోజు కలిసి కాలేజీకి వెళ్లడం, రావడం, సందేహాలు వస్తే డిస్కస్ చేసుకోవడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ప్రేమించుకొన్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. కానీ పెద్దలు వీరి ప్రేమకు బ్రేక్ ఇచ్చారు. వావి, వరస లేకుండా ఏంటీ పిచ్చి చర్య అని తిట్టిపోశారు. దీంతో ప్రేమ జంట తమ భవిష్యత్పై మదనపడిపోయింది.

కలిసి జీవించలేమని..
తమ ప్రేమకు పెద్దలు అంగీకరించబోరని, పెళ్లి చేసుకోలేమని భావించారు. కలిసి జీవించలేని.. తాము చావుతోనైనా ఒక్కటవ్వాలని భావించారు. మమత, ప్రశాంత్ ఇద్దరూ తమ తమ ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారుడు చనిపోవడంతో ప్రశాంత్ కుటుంసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మమత ఫ్యామిలీ మెంబర్స్ రోదనలు అక్కడున్న వారిని కూడా కలచివేసింది.

పోస్టుమార్టం
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేశాక.. బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వరసకు అన్నా చెల్లెళ్లు అయ్యే వారి ప్రేమను పెద్దలు వద్దనగా.. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.












Click it and Unblock the Notifications