ప్రేయసి కోసం వెళ్తే బైక్ దొంగ అన్నారు... మనస్థాపంతో పురుగుమందు తాగేశాడు
ప్రేయసిని చూసేందుకు వెళితే.. బైక్ దొంగతనం నేరం మోపారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్గొండ: ప్రేయసిని కలుసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడిపై బైక్ దొంగతనం నేరం మోపడంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నేరళ్ల రఘు పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
అయితే వీరి కులాలు వేరు కావడం వల్ల పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తన ప్రేయసిని చూసేందుకు రఘు ఇటీవలే గుడిపల్లి గ్రామానికి వెళ్లాడు. అదే సమయంలో అమ్మాయి తరపు బంధువులు తమ ద్విచక్రవాహనం కనిపించడం లేదంటూ గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో స్థానిక పోలీసులు రఘును అనుమానించి అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. అయితే తాను ఒకందుకు వెళ్తే ఇంకొకటి జరగటం, బైక్ దొంగతనం నింద తనపై పడడంతో రఘు తీవ్ర మనస్థాపానికి గురయి.. పురుగుల మందు తాగేశాడు.
అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని చికిత్స నిమిత్తం నల్గొండలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం.. అక్కడ్నించి హైదరాబాద్ కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రఘు మృతిచెందాడు. మృతుడి సోదరుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.