బిటెక్ ప్రేమ జంట ఆత్మహత్య: యజమానిపై దాడి
హైదరాబాద్: ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ బుధవారం ఉదయం సారథి నగర్ దగ్గర ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థులు కిరణ్మయి, సాయికిరణ్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు
మెదక్ జిల్లా జహీరాబాద్ చెన్నారెడ్డినగర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి యజమానిపై దాడి చేసి 5 తులాల బంగారం, నగదు అపహరించారు. ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మూడు కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమ బంగారం పట్టబడుతూనే ఉంది. తాజాగా బుధవారం ఉదయం కస్టమ్స్ అధికారులు 3 కేజీల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో అధికారులు ఈ బంగారాన్ని కనుగొన్నారు. అయితే, బంగారాన్ని ఎవరు తీసుకొచ్చారో ఇంకా తెలియలేదని వారు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి దగ్గర బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 10 మందికి గాయలయ్యాయి. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
వడదెబ్బకు కూలీ మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందాడ గ్రామానికి చెందిన కారుకొండ నర్సింహులు(45)ఎండ దెబ్బతో మంగళవారం మృతి చెందాడు. సోమవారం నర్సింహులు ఉపాధి హామీ పనులకు వెళ్లి ఎండలో కోపు గుంతలు తవ్వుతుండగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. వెంటనే నర్సింహులును గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.