చలి పులి: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. జనం గజ గజ.. మోమిన్పేట్లో 5 డిగ్రీలు..
తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం చలికి వణుకుతున్నారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి పంజా విసిరింది. ఉదయం 8 గంటల వరకు గ్రామాలను మంచుతెర కమ్మేస్తుంది. దీంతో జనం ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తేమతో కూడిన శీతలగాలులు వీయడంతో పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
చలికి మంట కాస్తోన్న జనం..
చలి తీవ్రతను తట్టుకోలేక ప్రజలు చలి మంటలు కాపుకొంటున్నారు. చలి ప్రభావం కారణంగా మరో వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెట్టర్లు, జర్కిన్లు ధరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సోమవారం 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరిలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అత్యల్ప ఉష్ణోగ్రత
వికారాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. చల్లటి గాలి, రోైడ్లు కనిపించనంత పొగమంచు ఉంటోంది. మోమిన్పేట్లో కనిష్ఠంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మర్పల్లిలో 5.7, బంట్వారంలో 6.6, మన్నెగూడ 8, కోట్పల్లి 8.1డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పశు, పక్షాదులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.
వారం నుంచి తగ్గుతోన్న ఉష్ణోగ్రత
రంగారెడ్డి జిల్లా పరిధిలో వారం రోజులుగా 12 నుంచి 14డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉన్ని దుస్తులకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సలహాలు, సూచనలు పాటిస్తే రోగాల బారి నుంచి ఉపశమనం దొరుకుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాడ్గుల మండలంలో రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి ఎక్కువగా ఉంటోంది. మంచు కురుస్తుండడంతో జనం ఉదయం తొందరగా ఇండ్లనుంచి బయటకు వెళ్లడం లేదు. కడ్తాల్ మండలంలో ఉదయం, రాత్రివేళల్లో చలి ప్రభావానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా ఇండ్లలో నుంచి బయటకు రావడంలేదు. .
ఎండ వచ్చేవరకు..
ఉదయం ఎండవచ్చే వరకు చిన్నపిల్లలు, వృద్ధులు, అస్తమా వ్యాధిగ్రస్తులు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉన్నితో పాటు శరీరానికి వెచ్చదనం ఇచ్చే దుస్తులు వేసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. తలకు మఫ్లర్, మంకీ టోపీలు పెట్టుకోవాలని కోరుతున్నారు. మంచు కురిసే దశలో బయటకు రావద్దని అంటున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
చలికాలంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశముంది అని.. సరైన జాగ్రత్తలు పాటించకపోతే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలని కోరుతున్నారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల ప్రతిఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు సరైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు.