నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లెలో మూడు రోజుల క్రితం జరిగిన ఇద్దరు యువతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆల్యేఖ్య(27), సాయిదివ్య(22)లను వారి తల్లిదండ్రులు పద్మజలు అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
నిమ్మకాయ, మిరపయాల ముగ్గు తొక్కడంతో..
ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు. ఆలేఖ్య, సాయిదివ్య తమ పెంపుడు కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను చనిపోతానని సాయిదివ్య అంటుండగా.. అది నిజమే కావచ్చంటూ ఆమెను మరింత మానిసకంగా కృంగిపోయేలా చేసింది అలేఖ్య. ఈ క్రమంలోనే దివ్యకు జనవరి 23న తల్లిదండ్రులు మంత్రగాడితో తాయత్తు కట్టించారు. అయినప్పటికీ దివ్యలో చనిపోతానన్న భయం పోలేదు.
తాను చనిపోతానంటూ సాయిదివ్య..
ఆ మరుసటి రోజు తాను చనిపోతానంటూ సాయిదివ్య గట్టిగా ఏడుస్తుండటంతో.. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంలు ఆమెను వేపకొమ్మలతో కొట్టారు. అయినా ఏడుపు ఆపకపోవడంతో ఆమెకు దెయ్యం పట్టిందని భావించి డంబెల్తో తలపై కొట్టారు. అనంతరం ఆమె నుదుటిపై కత్తితో కోశారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో దివ్య ఆరోజు మధ్యాహ్నం చనిపోయింది.
చెల్లిని తీసుకొస్తానంటూ అలేఖ్య.. తల్లిదండ్రులు చంపేశారు
ఈ నేపథ్యంలో చనిపోయిన తన చెల్లిని తిరిగి తీసుకొస్తానంటూ అలేఖ్య తన తల్లిదండ్రులకు చెప్పింది. తనను కూడా కొట్టి చంపాలని కోరింది. దీంతో ఆరోజు సాయంత్రం అలేఖ్య చెప్పినట్లుగానే అలేఖ్య నోటిలో కలశం పెట్టి డంబెల్తో తలపై కొట్టి చంపేశారు. కాగా, మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు.. పురుషోత్తంనాయుడు ఇంటికి వెళ్లి చూడగా.. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గ్లాసు ముక్కలు కనిపించాయి. ఆ తర్వాత ఆయన రాత్రి 9.30గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మదనపల్లె జైలులో నిందితులు పద్మజ, పురుషోత్తమనాయుడు
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితులు పద్మజ, పురుషోత్తమనాయుడులను అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. నిందితులిద్దరి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వారిని తిరుపతిలోని మానసిక వైద్యశాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులు కోరారు. కోర్టు నుంచి అనుమతి వచ్చిన తర్వాత వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించనున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరూ మదనపల్లె సబ్ జైలులో ఉన్నారు.
Recommended Video