ఖమ్మంలో టీఆర్ఎస్కు షాక్... పార్టీని వీడి వైఎస్ షర్మిలకు జై కొట్టిన కీలక నేత...
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. మధిర మున్సిపల్ వైస్ ఛైర్మన్ విద్యాలత తన పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్కు గుడ్బై చెప్పిన ఆమె మంగళవారం(మార్చి 16) వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసంలో షర్మిలను కలుసుకుని ఆమె పెట్టబోయే పార్టీకి మద్దతు ప్రకటించారు. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో తలపెట్టనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని తెలిపారు.
ఒంటరిగా వైఎస్ షర్మిల: ఇడుపుల పాయలో తండ్రికి నివాళి: ఆ ప్రకటన తరువాత తొలిసారిగా
మంగళవారం ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. అదే సమయంలో పార్టీకి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీఆర్ఎస్ కో, బీజేపీ కో బి-టీమ్గా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. సమస్యల పరిష్కారానికే తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని పలువురు నేతలు కోరినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పార్టీ ఏర్పాటుపై సీరియస్గా ఫోకస్ చేసిన షర్మిల రాజన్న రాజ్యం అన్న నినాదంతో ఆ దిశగా వేగంగా కదులుతున్నారు. అన్ని జిల్లాల ముఖ్య నేతలు,మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న షర్మిలకు మద్దతు ప్రకటించి.. ఆమె పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ లేదా షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల రాకతో తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఆమె వైపు మళ్లే అవకాశం ఉందని... ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తానెవరికీ బీ టీమ్గా ఉండాల్సిన అవసరం లేదని ఆమె తాజాగా మరోమారు స్పష్టం చేశారు.
షర్మిల పెట్టబోయే పార్టీపై తాజాగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ప్రస్తుతం వామప్ చేస్తోందని... ఏడాదిన్నరలో ఆమె ఏపీలోకి కూడా ఎంటర్ అవుతుందని చెప్పారు. షర్మిలకు ఏదైనా కీలక పదవిస్తే సమస్య సమసిపోయేదని అభిప్రాయపడ్డారు.