మోసం కేసులో విజయశాంతి ఊరట: కేసు కొట్టివేత
చెన్నై: ప్రముఖ సినీనటి, తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతిపై నమోదైన మోసం కేసును కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.5.21 కోట్ల విలువైన ఆస్తిని తనకు విక్రయిస్తానని నమ్మించి, మరొకరికి ఇచ్చారని ఆరోపిస్తూ విజయశాంతిపై కేసు నమోదైంది.
ఇందర్చంద్ జైన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను జార్జిటౌన్ కోర్టు తోసిపుచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇందర్చంద్జైన్ మద్రాస్ హైకోర్టుకు ఎక్కాు. ఈ కేసు పెండింగ్లో ఉండగానే ఇందర్చంద్ జైన్ చెన్నై ఎగ్మూర్ క్రైం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.

దాంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఎగ్మూరు కోర్టు కేంద్ర ఆర్థిక నేరవిభాగానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ విజయశాంతి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్తో పాటు గతంలో విజయశాంతికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి. న్యాయమూర్తి మురళీధరన్ ఎగ్మూర్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications