హరహర మహాదేవ.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం.. తెలంగాణాలో మహా శివరాత్రి వేడుకలు ఇలా!
తెలంగాణ రాష్ట్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు అన్ని శివనామస్మరణతో మారుమ్రోగి పోతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ శివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తజనం ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వేములవాడలో పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లక్షలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. దీనికోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది. . నిన్న రాత్రి వేములవాడలో కన్నుల పండుగగా మహా శివరాత్రి జాతర ప్రారంభం అయింది. విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని విశేషంగా ముస్తాబు చేశారు.ఈరోజు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయం వద్ద కిటకిటలాడుతున్నారు.

వేయి స్తంభాల దేవాలయంలో తాజా పరిస్థితి ఇలా
ఇటు హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలోనూ ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి. లక్షలాదిగా భక్తులు నేడు హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో ఉన్న రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దాదాపు 2 కిలో మీటర్ల మేర స్వామివారిని దర్శించుకోవటం కోసం బారులు తీరారు. వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరుడిని దర్శించుకోవటం కోసం దాదాపు 2 గంటల సమయం పడుతుంది.
రామప్ప ఆలాయంలో శివరాత్రి వేడుకలు
ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగొందుతున్న ములుగు జిల్లా రామప్ప రామలింగేశ్వర స్వామివారి దేవాలయం లో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తున్నారు.సాయంత్రం రామలింగేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహా శివరాత్రి
ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు గూడెం, లక్షెట్టిపేట చెన్నూరు గోదావరి నది తీరాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వేలాల మల్లికార్జున స్వామి ఆలయం బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయం ,కత్తెరసాల మల్లన్న ఆలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరోవైపు మహాశివరాత్రి పర్వదినాన కూసుమంచి గణపేశ్వరాలయం, ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయం పెనుబల్లి మండలం నీలాద్రిశ్వర స్వామి ఆలయం మధురలో ఉన్న మృత్యుంజయశ్వర స్వామి ఆలయం ఇలా ప్రముఖ శివాలయాలు అన్నింటిలోనూ భక్తులు పోటెత్తారు.












Click it and Unblock the Notifications