మహాశివరాత్రి బహుమానం: వేయిస్తంభాల గుడి కళ్యాణమండపం భక్తులకు అంకితం!!
మహాశివరాత్రి పర్వదినాన వేయి స్తంభాల దేవాలయానికి కళ్యాణ శోభ వచ్చింది. కాకతీయుల కాలంనాటి చారిత్రక వేయి స్తంభాల దేవాలయ కళ్యాణమండపాన్ని నేడు ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కళ్యాణ మండపాన్ని భక్తులకు, పర్యాటకులకు అంకితం చేశారు. రాష్ట్ర మంత్రులతో కలిసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి
ఆపై శాంతిహోమాన్ని నిర్వహించారు.
కాకతీయుల కాలంనాటి అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టడమైన వేయి స్తంభాల ఆలయానికి అనుబంధంగా ఉన్న కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించిన స్థపతులకు పూల వర్షంతో సన్మానించారు. ఈ ఆలయ పునరుద్ధరణకు పనిచేసిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులను సైతం కిషన్ రెడ్డి సన్మానించారు. అనంతరం శివరాత్రి పర్వదినం సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వేయి స్తంభాల దేవాలయాన్ని కట్టడానికి 72 సంవత్సరాలు పట్టిందని, మధ్యయుగంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాలను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేశామని, దీనివల్లే సంపూర్ణమైన వేయి స్తంభాల దేవాలయం పూర్తయిందని వెల్లడించారు.
అంతేకాదు 2005 నుండి ఇప్పటివరకు పనులు కొనసాగాయని, కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులను నిర్వహించేందుకు మొత్తం 15 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేశామని తెలిపారు. శాండ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు, దీని నిర్మాణానికి శిల్పులు ఎంతగానో కృషి చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దీనిని కానుకగా ఇచ్చినట్టు వెల్లడించారు.
చారిత్రక వేయి స్తంభాల దేవాలయ నిర్మాణానికి అప్పట్లో కాకతీయుల కాలంలో విశేషమైన కృషి జరిగింది. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజుల్లో మొదటి రుద్రుడు క్రీస్తు శకం 1163 లో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1400 మీటర్ల వైశాల్యంలో శివ, కేశవ, సూర్య దేవాలయాలను, త్రికూట ఆలయాలుగా నిర్మించారు.
టెక్నాలజీ అందుబాటులో లేని నాటి రోజుల్లోనే టన్నులకొద్దీ బరువు ఉండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం వేయి స్తంభాలతో వెయ్యేళ్ళ వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు. అయితే వేయి స్తంభాల ఆలయం కళ్యాణమండపం శిథిలమవుతున్న క్రమంలో పునర్నిర్మించాలని భావించిన కేంద్రం 2005లో దీనికి శ్రీకారం చుట్టి నేటికి కళ్యాణ మండపాన్ని పూర్తిచేసి శివరాత్రి రోజు భక్తులకు బహుమానంగా ఇచ్చింది.












Click it and Unblock the Notifications