చెత్త రాజకీయాలు.. సీమాంధ్రులు-తెలంగాణవాళ్లు కొట్టుకోవాలా: కెటిఆర్
హైదరాబాద్: భాగ్యనగరంలోని సీమాంధ్రులు, తెలంగాణవాళ్లు కొట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తోందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లో నియోజకవర్గ పార్టీ సమావేశానికి కెటిఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాదులో నాలుగు ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ చెత్త రాజకీయాలు చేస్తోందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే గతంలో ఎవరూ చేయని అభివృద్ధిని మేం చేసి చూపిస్తామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గ్రేటర్పై గులాబీ జెండా ఎగరాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్లో అల్లకల్లోలం అవుతుందని విష ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నారు. హైదరాబాద్ మినీ భారత దేశం అన్నారు.
తెలంగాణ వచ్చాక హైదరాబాద్లో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు. హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచామని, మహిళల రక్షణ కోసం 100 షీ టీమ్లను ఏర్పాటు చేశామని, నగరంలో సీసీటీవీలు, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక నేరాల సంఖ్య తగ్గిందన్నారు.
పేదల అభ్యున్నతి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నామని, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు. అందుకే కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా రూ.51వేలు ఇస్తున్నారన్నారు. అరవై ఏళ్ల దరిద్రం 18 నెలల్లో పోదన్నారు. తాము అధికారంలో వచ్చాక 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు.
ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుందామని తాము ఉద్యమం సమయంలోనే చెప్పామన్నారు. రాష్ట్రాలుగా విడిపోవడం వల్లే ఏపీ అభివృద్ధి చెందిందని, ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించకుండా నీచరాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. విభజన వల్ల ఏపీకి పెద్దపెద్ద ప్రాజెక్టులు పోతున్నాయన్నారు.
అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేదని ఆరోపించారు. మోడీ పరిస్థితి ఎక్కే విమానం, దిగే విమానంలా తయారైందన్నారు. 18 నెలల్లో ప్రజలు మెచ్చే పాలన ఇచ్చామని, అరవై ఏళ్లలో టీడీపీ, కాంగ్రెస్లు చేయని అభివృద్ధి చేసి చూపించామన్నారు.
సాయంత్రం రిజర్వేషన్ల ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఫిబ్రవరి 2వ తేదీన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.