రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట: హైదరాబాద్తోపాటు దేశంలో ఎక్కడైనా తిరుగొచ్చు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్తో సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని మంగళవారం హైకోర్టు తీర్పు చెప్పింది.
కాగా, ప్రతి సోమవారం సాయంత్రంఏసిబి ఆఫీసులో హాజరుకావాలని ఆదేశించింది. ఇంతకుముందు బెయిల్ ఇచ్చిన తర్వాత సొంత నియోజకవర్గంలోనే ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించే సమావేశాల్లో రేవంత్ పాల్గొనే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా, ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి దర్యాఫ్తు కొనసాగిస్తోంది. నిందితుడు సెబాస్టియన్ ఫోన్లో నమోదైన సంభాషణల ఫోరెన్సిక్ విశ్లేషణల తుది నివేదిక సిద్ధమవుతోందని తెలుస్తోంది.
వారం రోజుల్లో ఆ నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. సెబాస్టియన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో మొత్తం 500 ఫోన్ కాల్స్కు సంబంధించిన సంభాషణలు నమోదైనట్లు ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటినీ విశ్లేషించిన తర్వాత వాటిలో వంద కాల్స్ మాత్రమే ఈ కేసుతో సంబంధం ఉందని, మిగతావన్నీ వ్యక్తిగతమని తేల్చారని తెలుస్తోంది.
కేసుతో సంబంధం ఉన్న కాల్స్లో సమాచారాన్ని తమ దర్యాప్తు కోసం నియోగించుకోవాలని ఎసిబి అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఫోన్ విశ్లేషణ కోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్ అధికారులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పని జరుగుతోంది.
తమ దర్యాప్తునకు అవసరమని భావించిన కాల్స్ను ఎసిబి విశ్లేషిస్తోంది. వాటిలో ఉన్న సంభాషణలను యథావిధిగా ఆంగ్లంలో ముద్రించి కోర్టుకు సమర్పిస్తారు. సంభాషణ ఎవరెవరి మధ్య జరిగిందో గుర్తించడంతో పాటు అందులో స్వరం వారిదా? కాదా? అన్నదాన్ని కూడా నిర్ధారించనున్నారు.