బీజేపీ ట్రాప్ లో మల్లారెడ్డి? మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి వెనుక అధిష్టానం; బిగ్ స్టోరీ!!
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మంత్రి మల్లారెడ్డి పైన ఒకసారి ఫోకస్ పెట్టాయి. మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, ఆస్తులపై ఐటి దాడులు జరగడం, ఐటీ దాడుల తర్వాత మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో మేడ్చల్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఆయన తీరుపై బాహాటంగా విమర్శలు చేయడం వంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి. అసలు మంత్రి మల్లారెడ్డి విషయంలో ఐటీ దాడులు ఎపిసోడ్ నుంచి ఏం జరుగుతుంది? ఎందుకు మల్లారెడ్డి ఇప్పుడు రాష్ట్రం లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు? వంటి అనేక విషయాలపై చర్చిస్తున్న సమయంలో కొత్తగా ఒక విషయం తెర మీదకు వచ్చింది.
బీజేపీకి టచ్ లో మంత్రి మల్లారెడ్డి.. ఐటీదాడుల ఎపిసోడ్ తర్వాత
మంత్రి మల్లారెడ్డి బీజేపీకి టచ్లో ఉన్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి ఇళ్ళు, ఆస్తులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మల్లారెడ్డి ఐటీ అధికారులపై అనుచితంగా ప్రవర్తించడం, వారు తమ కుమారుడిని కొట్టారని కేసులు పెట్టడం, ఇక ఐటి అధికారులు కూడా తమ ల్యాప్ టాప్ లాక్కున్నారని, తమ విధులకు విఘాతం కలిగించారని మల్లారెడ్డి పై కేసులు పెట్టడం తెలిసిందే. అంతేకాదు మల్లారెడ్డి ఆస్తులలో మనీలాండరింగ్ వ్యవహారాలు ఉన్నాయని ఈడీ అధికారులు వీటిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని, ఈడికి కూడా లేఖ రాసినట్టు సమాచారం.
బీజేపీ తీర్దం పుచ్చుకోవటానికి మల్లారెడ్డి రెడీ.. అందుకే ఈడీ దాడులు లేవా?
అయితే కెసిఆర్ ఉండగా తనకు ఏమీ కాదని, అంత కేసీఆర్ చూసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసి కెసిఆర్ పై చాలా విశ్వాసం ప్రకటించిన మంత్రి మల్లారెడ్డి, తనపై ఈడీ దాడులు జరుగుతాయేమో అని భావించిన నేపథ్యంలో బిజెపి నేతలకు టచ్లో వెళ్లారని ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ లో చేరడానికి మంత్రి మల్లారెడ్డి ఆసక్తి చూపిస్తున్నారని, బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి ఓకే చెప్పారని కూడా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి పై ఇప్పటివరకు ఈడీ దాడులు జరగలేదని కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
మంత్రి మలారెడ్డిపై అసమ్మతి వెనుక హైకమాండ్
ఈ క్రమంలోనే బిజెపికి టచ్ లోకి వెళ్ళిన మంత్రి మల్లారెడ్డి వ్యవహారమంతా అధిష్టానం దృష్టికి వెళ్లి, అధిష్టానమే ఆయనపై అసమ్మతిని ప్రోత్సహించిందని చర్చ జరుగుతుంది. ఇంతకాలం సైలెంటుగా ఉన్న, ఎప్పుడూ ఎక్కడా చిన్నపాటి విమర్శ కూడా చెయ్యని మేడ్చల్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మంత్రి మల్లారెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకు పడటం వెనుక బీఆర్ఎస్ అధిష్టానం ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారెడ్డి కి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కావడం, మల్లారెడ్డి విషయంలోనూ సంచలన ఆరోపణలు చేయడం, మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం సహజంగా హైకమాండ్ కు ఆగ్రహం తెప్పిస్తాయి. కానీ ఈ విషయంలో హైకమాండ్ స్పందించలేదు.
అసమ్మతి నేతలు ఇంత చేస్తున్నా హైకమాండ్ సైలెంట్ అందుకే
ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలి కానీ, ఈ విధంగా బహిరంగ చర్చ పెట్టడాన్ని ఏ పార్టీ కూడా స్వాగతించదు. కానీ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళకుండా బయట వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం ఇక ఇప్పుడు ఏకంగా గ్రూపుగా తిరుమలకి వెళ్లి, అక్కడ కూడా చర్చ పెట్టడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి కి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపించడం వెనుక హైకమాండ్ ఉండటం వల్లనే, హైకమాండ్ ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
మల్లారెడ్డి రాజకీయం మారబోతుందా?
ఇక మంత్రి మల్లారెడ్డి బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లారా? అసలు ఏం జరుగుతుంది అన్నది నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం అసలు విషయం క్లారిటీ వచ్చిందంటే మంత్రి మల్లారెడ్డి ని పదవి నుంచి తప్పించే అవకాశముందని చర్చ జరుగుతుంది. ఇక ఏది ఏమైనా మంత్రి మల్లారెడ్డి రాజకీయం త్వరలో కొత్త మలుపు తీసుకోబోతోందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.