ఉద్యోగాలిప్పిస్తామని మోసం: కటకటాలు లెక్కిస్తున్న బాషా (ఫొటో)
హైదరాబాద్: ఉద్యోగాల కోసం యువత మోసగాళ్ల బారిన పడడం సర్వసాధారణంగా మారింది. తాజాగా, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి ఓ వ్యక్తి లక్షల్లో రూపాయలు వసూలు చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
ఈ సంఘటన హైదరాబాదులోని చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ గురు రాఘవేంద్ర ఆ వివరాలను అందించారు. సికిందరాబాద్ అల్వాల్లోని సిటిజెన్కాలనీలో నివసించే షేక్ మహబూబ్బాషా అలియాస్ ప్రతాప్రెడ్డి అలియాస్ అశోక్రెడ్డి(53) వ్యాపారి.
కొత్తపేట సమీపంలోని మోహన్నగర్లో రాయల్ ప్లేస్మెంట్ సర్వీసెస్ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. వరుణ్ను భాగస్వామిగా, జంగయ్య, వెంకటేశ్వర్రావు, యాదయ్య, వెంకట్, భానులను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.90 లక్షలు వసూలుచేశాడు.
నకిలీ నియామకపత్రాలు, ఐడెంటీ కార్డులు సృష్టించి నిరుద్యోగులను ముంచేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితుడిని అరెస్ట్చేసి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.