సోదరికి కొడుకు పుట్టాడని అత్తారింటికి చెప్పడానికి బాలుడి కిడ్నాప్
హైదరాబాద్: తన సోదరికి మగ బిడ్డను తెచ్చి, ఆమె అత్తింటి వారికి కొడుకు పుట్టాడని నమ్మించేందుకు 8 నెలల బాబును అర్ధరాత్రి తల్లి పక్కలో నుంచి కిడ్నాప్ చేసిన ముఠాను హైదరాబాదులోని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి కథనం ప్రకా రం - సికింద్రాబాద్ రాంగోపాల్పేట్కు చెందిన జెల్లాపురం లావణ్య, స్వప్ప అక్కాచెల్లెలు. స్వప్పకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టి, మూడో కాన్పులో కవలలు ఆడపిల్లలే పుట్టారు.
అందరూ ఆడపిల్లలే ఉండడంతో అత్తింటి వారి నుంచి సమస్యలు వస్తాయని భావించారు. స్వప్నకు ఆడపిల్ల, మగపిల్లవాడు పుట్టాడని ఆమె అత్తింట్లో లావణ్య చెప్పింది. బాబు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడంటూ నమ్మించారు.
తన అక్కడకు బాబును తేవాలనే ఉద్దేశంతో లావణ్య స్నేహితుడైన గోల్కొండకు చెందిన నాగరాజు సహాయంతో నిలోఫర్ వద్ద పర్వీన్, స్వప్న అనే ఇద్దరు మహిళలను కలిశారు. వారి సాయంతో వారం రోజుల క్రితం లక్డీకాపూల్లోని హనుమాన్ టెంపుల్ వద్ద బిక్షాటన చేసే భాగ్య అనే మహిళ కొడుకు లవ అలియాస్ బాబు(8 నెలలు) కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు.
కిడ్నాప్కు పర్వీన్, స్వప్నలు స్థానికంగా బిక్షాటన చేసే తబుసమ్, పూజ, శిరీష అలియాస్ అఫ్రీన్, షహీన్తో మాట్లాడారు. రూ. 10 వేలకు ఒప్పందం చేసుకున్నారు. గత నెల 30న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో హున్మాన్ టెంపుల్ వద్ద భాగ్య గాడ నిద్రలో ఉండగా, ఈ ముఠా ఆమె పక్కలో నుంచి 8 నెలల కొడుకును కిడ్నాప్ చేసి లావణ్యకు అప్పగించారు.
ఉదయం లేచి చూసే సరికి కొడుకు కన్పించకపోవడంతో భాగ్య నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. లావణ్య నుంచి బాలుడిని తల్లి ఒడికి చేర్చారు. పూజ, షాహిన్ పరారీలో ఉండగా, మిగతా వారందరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.