ఫోన్ మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్లాడు, ప్రమాదంలో బ్రెయిన్ డెడ్, మృతి
హైదరాబాద్: ఓల్డ్ సిటీలో ఘోరం జరిగింది. బహదూర్పురా నాలా వద్ద సెల్ ఫోన్లో మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్తున్న మోహినుద్దీన్ (35) అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ రాంగ్రూట్లో వెళ్తున్న మోహినుద్దీన్ను మరో బైక్ ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బహదూర్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తలకి బలమైన గాయం కావడంతో మోహినుద్దీన్ బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. వాహనాలను డ్రైవ్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
మృతి చెందిన వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న తన బైక్ను ఫోన్లో మాట్లాడుతూనే తీశాడు. అలాగే ఫోన్లో మాట్లాడుతూ.. రాంగ్ రూట్లో నుంచి అవతలి రూట్లోకి వెళ్తున్నాడు. ఆ సమయంలో మరో బైక్ ఢీకొట్టింది.
రోడ్డు భద్రతపై సదస్సు
రోడ్డు భద్రతపై రవీంద్ర భారతిలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడారు. పిల్లల ట్రావెల్ సేఫ్టీ బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులదేనని చెప్పారు. మైనర్లకు తల్లితండ్రులు వాహనాలు ఇవ్వవద్దని చెప్పారు. పోలీస్ శాఖ చర్యలతో మూడేళ్లలో ఏటా 70 నుంచి 80 మరణాలు తగ్గాయన్నారు.