విషాదం : మందు పందెంలో స్నేహితుడు బలి... అలా తాగాలని ఛాలెంజ్ విసరడంతో..
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఇద్దరు స్నేహితులు సరదాగా వేసుకున్న మందు పందెం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. నీళ్లు కలపకుండా మద్యం తాగాలని స్నేహితుడు షరతు పెట్టడంతో... పందెం నెగ్గేందుకు అలాగే చేసిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబం తీవ్రంగా విలపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... బాన్సువాడకు చెందిన సోమేశ్వరం సాయిలు(40) అతని స్నేహితుడు కలిసి శుక్రవారం(అక్టోబర్ 23) మద్యం సేవించారు. ఈ సందర్భంగా సాయిలు స్నేహితుడు అతనితో సరదాగా ఓ పందెం కాశాడు. నీళ్లు కలపకుండానే మొత్తం మందు తాగాలని షరతు విధించాడు. దీంతో సాయిలు నీళ్లు కలపకుండానే మద్యాన్ని గటగటా తాగేశాడు. కానీ ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.
సాయిలు మృతిపై అతని భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు సాయిలు మృతితో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
ఈ ఏడాది అగస్టులో నిర్మల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లక్ష్మణచాంద మండలం చింతలచాందకు చెందిన తాపీ మేస్త్రీ షేక్ ఖాజా రసూల్(31) తన తోటి తాపీ మేస్త్రీలు విసిరిన ఛాలెంజ్ మేరకు ఫుల్ బాటిల్ను 20 నిమిషాల్లోనే ఖాళీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మధ్యలోనే హఠాత్తుగా కుప్పకూలాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పందెంలో నెగ్గితే రూ.20వేలు ఇస్తామని రసూల్ను రెచ్చగొట్టిన రత్తయ్య, నాగూర్బాషా అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.