పెళ్లిళ్లను టార్గెట్ చేసిన బిటెక్ బాబు: అందినంత డబ్బుతో ఉడాయింపు
వరంగల్ కరీమాబాద్ కి చెందిన ఓ ఇంజనీరింగ్ యువకుడు నగరంలో జరిగే పెళ్లిళ్లను టార్గెట్ చేసుకుని అందినంత డబ్బుతో ఉడాయిస్తున్నాడు.
వరంగల్: మహానగరంలో జరిగే పెళ్లిళ్లు అంటే అతడికి ఇష్టం... వేడుక ఎక్కడైనా, ఎంత దూరమైనా సమయానికి వాలిపోతాడు.. సూటు, బూటు ధరించి వస్తాడు... బంధువుల్లో కలిసిపోతాడు... అటూ ఇటూ తిరుగుతాడు... హడావుడి చేస్తాడు.. అందినకాడికి దోచుకెళ్తాడు... ఈ ఘనుడిని . పట్టుకోవడం కోసం ప్రస్తుతం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి..
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్లోని కరీమాబాద్కు చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఉదయం లేవగానే మోటారు సైకిల్పై తిరుగుతాడు. ఎక్కడ పెళ్లి ఉంటుందో తెలుసుకుంటాడు. కచ్చితమైన పెళ్లి సమయం, వధూవరుల వివరాలను సేకరిస్తాడు. కొత్త దుస్తులు ధరించి సమయానికి ఫంక్షన్ హాలుకు వస్తాడు.
ముందుగా భోజనం చేస్తాడు. తర్వాత కల్యాణ వేదిక వద్దకు చేరుకుంటాడు. వధూవరులు వచ్చాక అక్కడికి వెళ్తాడు. వధువు బంధువులకు అబ్బాయి మిత్రుడినని.. అబ్బాయి బంధువులకు అమ్మాయికి దగ్గరి బంధువునని చెబుతాడు. కొంతసేపు పెళ్లి సామాన్లను సర్దుతాడు. అవసరమైనవి అందిస్తూ ఉంటాడు. హడవుడి చేస్తాడు. కొత్త జంటను ఆశీర్వదించే సమయంలో బంధువులు, స్నేహితులు ఇచ్చే డబ్బుల సంచిని కనిపెడుతుంటాడు. సమయం చిక్కగానే దాన్ని తీసుకొని క్షణాల్లో ద్విచక్ర వాహనంపై వెళ్తాడు.
వరుస ఘటనలతో కలకలం...
వరంగల్ మహానగరంలో కొన్ని రోజులుగా ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పెళ్లిళ్ల సమయంలో తీసిన వీడియోలను పరిశీలించారు. మూడు వివాహాల్లోని వీడియోల్లో ఒకే యువకుడు రావడం.. మండపాల్లో వధూవరుల వెనుక నిల్చొవడం.. గమనించారు.
గత నెలలో జరిగిన పెళ్లిలో నూతన దంపతుల వెనుక ఉండి.. బంధువులు ఇచ్చిన సుమారు రూ. లక్ష కట్నాలను అపహరించాడు. మరో పెళ్లిలో రూ. 25వేల వరకు తస్కరించాడు. వీడియోల్లో ఉన్న యువకుడు.. చోరీలకు పాల్పడే వ్యక్తి ఒక్కడే అని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. అతని కోసం గాలిస్తున్నారు.
నగర శివార్లలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలపై నిఘా వేసి ఉంచారు. నిందితుడు చిక్కితే ఎన్ని చోరీలకు పాల్పడ్డాడు? ఏ రకంగా చేశాడు? అనే విషయాలు వెలుగులోకి వస్తాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.
అప్రమత్తత అవసరం...
ప్రస్తుతం పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. బంగారు వస్తువులు, నగదు ఉన్న ప్రాంతానికి అపరిచితులను రానివ్వొద్దు. వధూవరుల పేర్లు చెప్పినా ప్రశ్నించాలి. అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే మోసపోయే ప్రమాదం ఉంటుందని పోలీసులు అంటున్నారు.