మార్ఫింగ్ చిత్రాలతో ఆమెకు టార్చర్..:ఎట్టకేలకు అతన్ని పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: కాలేజీ రోజుల్లో ఏర్పడ్డ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఓ యువతికి దగ్గరవాలని ప్రయత్నించాడో యువకుడు. కానీ అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో.. అతని ప్రేమను తిరస్కరించింది.
అప్పటినుంచి ఆమెపై కక్ష పెంచుకున్న అతగాడు మార్ఫింగ్ చిత్రాలతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన చింతకాయల సురేష్.. ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో చదువుతున్న ఓ యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ యువతికి వేరొకరితో వివాహం జరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు సురేష్. పెళ్లయ్యాక కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
ఇదే క్రమంలో ఓరోజు ఆ యువతి ఇబ్రహీంపట్నం బస్ స్టేషన్ లో బస్ కోసం వేచి చూస్తుండగా.. ఆమె వద్దకు వెళ్లాడు. బలవంతంగా ఆమె సెల్ ఫోన్ లాక్కుని.. అందులోని కొన్ని ఫోటోలను తన సెల్ ఫోన్ లోకి పంపించుకున్నాడు. ఆమె మొబైల్ కూడా తిరిగివ్వలేదు. ఆపై ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమెకు కాబోయే భర్తకు పంపించాడు.
సురేష్ తీరుతో తీవ్ర ఆగ్రహం చెందిన బాధితురాలు.. తన సోదరితో కలిసి అతని ఇంటికి వెళ్లి గొడవ చేసింది. దీంతో సురేష్ తల్లిదండ్రులు అతని నుంచి సెల్ ఫోన్ లాక్కుని ఆమెకు ఇప్పించారు.
అయినా తీరు మార్చుకోని సురేష్.. ఆమె ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు
సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని సెల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. అతనిపై నిర్భయ, ఐటీ, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications