మామిడి కాయల చోరీ: వేయి రూపాయల కోసం హత్య
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మల్హర్ మండలంలో పెద్దతూండ్ల గ్రామానికి చెందిన నక్క రమేశ్ (25)ను పాతకక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆ యువకుడి ఉదంతంపై పోలీసులు దర్యాప్తు సాగించారు.
పెద్దతూండ్ల గ్రామానికి చెందిన నక్క రమేశ్, వేసవిలో అజ్మీరా రాజునాయక్కు చెంది న మామిడి తోటలోని కాయలు కోశాడు. అప్పుడు గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. తన తోటలోని మామిడికాయలను దొంగిలించినందుకు వేయి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని అజ్మీరా రాజునాయక్ పంచాయతీ పెద్దలను డిమాండ్ చేయగా, అందుకు రమేశ్ రూ.వెయ్యి చెల్లించాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.
అనంతరం రమేశ్ మెదక్ జిల్లా రాపెల్లి గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో పనికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో 10 రోజుల కిందట స్వగ్రామానికి వచ్చిన రమేశ్, బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో రాజు నాయక్ కంటపడ్డాడు. దీంతో తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నావా అంటూ రమేశ్పై రాజునాయక్ దాడి చేసి తీవ్రంగా చితకబాదాడు.
అప్పటికే రాజు నాయక్ బారి నుంచి తప్పించుకున్న రమేశ్, ఇంటికి వచ్చి కిందపడిపోయి కొద్దిసేపటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పాత కక్షలతోనే రాజునాయక్ హత్యాయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడు రాజు నాయక్ కోసం గాలింపు చర్యలు తీవ్రం చేసినట్లు వారు చెప్పారు.