‘నేను జైలుకెళ్తే మీరెలా బతుకుతారు’: తల్లి, చెల్లిని సజీవదహనం చేశాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తాను జైలుకెళితే తన కుటుంబసభ్యులు ఎలా బతుకుతారనే పిచ్చి ఆందోళతోనే మొత్తం కుటుంబాన్నే సజీవదహనం చేశాడు. ఈ ఘటనలో అతని తల్లి, చెల్లి, మృతి చెందగా, పారిపోయి బయటపడ్డాడు తమ్ముడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని జినుగుర్తిలో గురువారం వెలుగుచూసింది.
తాండూరు గ్రామీణ సీఐ సైదిరెడ్డి, గ్రామస్థుల కథనం ప్రకారం... జిన్గుర్తికి చెందిన క్షీరసాగర్లక్ష్మిబాయి(75) పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. కూతురు భీమజ్యోతి(28) ఒంటిపై కణితులు ఉండటంతో ఇంటివద్దే ఉంటోంది. మొదటి కుమారుడు సత్యవిజయ్కుమార్(31) పట్టణంలోని మిఠాయి దుకాణంలో, రెండో కుమారుడు చంద్రప్రకాశ్(23) హోటల్లో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.
లక్ష్మిబాయికి ఆసరా పథకం కింద నెలనెలా వస్తున్న పింఛన్ డబ్బు రూ. వెయ్యితోపాటు కుమారుల ఆదాయమే వారికి ఆధారం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో ఏడాది క్రితం విజయ్కుమార్తో గొడవపడిన భార్య కుమారుడిని తీసుకుని బేగంపేటలోని పుట్టింటికి వెళ్లిపోయింది.
కాగా, పాతతాండూరులో గుప్తనిధులు కోసం తవ్వకాలకు పాల్పడిన ఘటనలో విజయ్కుమార్పై 2013లో కేసు నమోదైంది. ఈ క్రమంలో మార్చి 21న కోర్టు అతనికి వారెంటు జారీ చేసింది. సంబంధిత న్యాయవాది విజయ్కుమార్ను పిలిపించి వారెంట్ జారీ అయ్యిందని, వెంటనే రూ.2 వేలు చెల్లిస్తే వారెంటును రీకాల్ చేయిస్తానని తెలిపారు. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.
ఇంటికి వచ్చిన విజయ్కుమార్ ఇంట్లో డబ్బు లేకపోవడం, తెలిసిన వారి దగ్గర అప్పు కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక తాను జైలుకు వెళ్లడం ఖాయమని భావించాడు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులతోను చర్చించాడు. తాను జైలుకు వెళ్తే తనమీదే ఆధారపడ్డ తల్లి, చెల్లి, సోదరుడు వీధినపడతారని మనస్తాపం చెందాడు. కుటుంబీకులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
ప్రతిరోజు ఇంట్లో నిద్రించే కుటుంబసభ్యులను బుధవారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకోవాలని సూచించాడు. ఎండాకాలం కావడంతో అందరూ ఆరుబయట నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో విజయ్కుమార్ అక్కడే ఉన్న కిరోసిన్ను తమ్ముడు, చెల్లెలు, తల్లి మీద కుమ్మరించి అగ్గిపెట్టే తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లాడు. అలజడికి నిద్రలేచిన చంద్రప్రకాశ్ వెంటనే వీధిలోకి పరుగెత్తి కేకలు వేస్తూ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు.
గ్రామస్థులు ఇంటివద్దకు వచ్చేసరికి అప్పటికే నిప్పంటించడంతో మంటల్లో క్షీరసాగర్ లక్ష్మిబాయి, భీమజ్యోతి పూర్తిగా కాలిపోయారు. కొనవూపిరితో ఉన్న సత్యవిజయ్కుమార్ను వెంటనే 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
సమాచారం అందుకున్న తాండూరు గ్రామీణ సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ చంద్రకాంత్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా వారెంటు రీకాల్ చేయించేందుకు న్యాయవాది అడిగిన డబ్బుల్లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిపెట్టిన నోట్ లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, మృతదేహాలకు తాండూరు జిల్లా ఆస్పత్రిలో శవపరీక్ష చేశారు. బంధువులెవరూ లేకపోవడం, సోదరుడు అంత్యక్రియలకు అవసరమైన మొత్తం తన వద్ద లేదని చంద్రప్రకాశ్ చెప్పడంతో గ్రామస్థులే విరాళాలు వేసుకుని పురపాలక సిబ్బంది ద్వారా తాండూరులో అంత్యక్రియలు జరిపించారు.