అనుమానంతో భార్య హత్య: పోలీసులకు లొంగుబాటు
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. సూర్యాపేటలోని విఆర్డిఆర్ థియేటర్ సమీపంలో నివసించే దస్తగిరి అనే వ్యక్తి తన భార్య మహబూబాను కత్తితో పొడిచి చంపాడు.
తన భార్య కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అతను ఆ ఘోరానికి పాల్పడ్డాడు. హత్యానంతరం దస్తగిరి స్థానిక పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
వరంగల్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారంనాడు వెలుగు చూసింది. రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన మహ్మద్ సలావుద్దీన్ శ్(23) డిగ్రీ వరకు చదువుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు.
మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సలావుద్దీన్ రైలు పట్టాల పక్కన విగతజీవుడై కనిపించాడు. ఈ సంఘటనపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నైట్ వాచ్మన్ ఆత్మహత్య
మహబూబ్నగర్ జిల్లా పెదకొత్తపల్లి ఎంపిడివో కార్యాలయంలో నైట్ వాచ్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కార్యాలయంలోనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నర్సింహ అనే ఆ వాచ్మన్ బుధవారం ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కంప్యూటర్ వైర్లకు ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.